పేదరిక నిర్మూలనే టీడీపీ ధ్యేయమని పేదరిక నిర్మూలన, సమసమాజ స్థాపన టిడిపి భావజాలమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు తెలియజేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1982 మార్చి 29 న తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం ఎనిమిది నెలల కాలంలోనే ఎన్నికల బరిలోకి దిగి అత్యధిక మెజారిటీతో గెలుపొంది తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశ, విదేశాలలో చాటారని తెలిపారు. ఎన్టీఆర్ నాయకత్వంలో పేదల సంక్షేమానికి చిహ్నంగా, అన్ని వర్గాలకు సమాన అవకాశాలను కల్పించడమే కాకుండా పాలనా వికేంద్రీకరణకు నాంది పలకడం జరిగిందని అన్నారు.
తెలుగుజాతి సమగ్రాభివృద్ధికి సంకేతంగా తెలుగుదేశం పార్టీ రూపొందించబడిందని తెలిపారు. ప్రస్తుత పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్నారని, పేదరిక నిర్మూలన ధనిక పేద అసమానతలను రూపుమాపడం ద్వారా ప్రజలను పేదరిక విష వలయం నుండి విముక్తి చేయాలన్నదే టిడిపి సంకల్పమని. ఇందుకు మిషన్ మోడ్ అప్రోచ్ తో పేదరిక నిర్మూలన కొరకు ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటి సారిగా 40 లక్షల కుటుంబాలకు రూ. 2 కే కిలో బియ్యం టిడిపి హయాంలోనే ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రజల ఆర్థిక వ్యవస్థ బలోపేతంతో పాటు సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, ప్రాంతీయ అసమానతల తొలగింపు పై ప్రత్యేక శ్రద్ధ వహించడం, సాంకేతికత అభివృద్ధితో అంతర్జాతీయ స్థాయి నాయకులుగా ఎదిగేందుకు కావలసిన సహాయ సహకారాలు అందించడం, జన్మభూమి స్ఫూర్తితో కుటుంబాన్ని ఒక యూనిట్ గా పరిగణించి ప్రోత్సహించడం టిడిపి భావజాలంలోని అంశాలని తెలిపారు.
ధనిక పేద అంతరాలను పోర్చాలంటే కుటుంబమే ప్రామాణికంగా, సాంకేతికతను వారధిగా వినియోగించి సాధికారత సాధించడమే ఏకైక మార్గమని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విశ్వాసమని తెలిపారు. ప్రస్తుత రాష్ట్ర ఖజానా రూ. 2,967 కోట్లు ఉన్నప్పటికీ పేదలకు కూడు, గుడ్డ, గూడు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పదాధికారులు పాల్గొన్నారు.