తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని వై ఎస్ జగన్ లక్షల కోట్ల ఆస్తులు అక్రమంగా సంపాదించారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ ఆర్థిక ఉగ్రవాదంపై నేడు ఆయన ప్రజంటేషన్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారాన్ని అడ్డంపెట్టుకొని సాక్షి పత్రిక, ఛానల్ ను జగన్ ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు.
సాక్షి పత్రిక, టీవీలో జగన్ పెట్టుబడి రూ.8 లక్షలు మాత్రమేనని అయితే సాక్షి విలువ మాత్రం రూ. 4 వేల కోట్లుగా ఎలా మారిందని ఆయన అన్నారు. ప్రభుత్వం నుంచి పొందిన లబ్దికి ప్రతిఫలంగా జగతి పబ్లికేషన్ లో వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. దీనివల్ల జగన్ క్విడ్ ప్రోకోను సమర్థవంతంగా ఎలా నిర్వహించారో తెలుస్తోంది.
తండ్రి వైఎస్ఆర్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని రూ.1.13 లక్షల కోట్లు కొట్టేశారు. తండ్రి హయాంలో దోచుకున్న డబ్బు ఇవాళ ఎన్నో రెట్లు పెరిగింది. ఓబులాపురంలో గాలి జనార్థన్ రెడ్డితో కలిసి జగన్ దోపిడీ చేశారు. జగన్ అవినీతికి మూలం సండూర్ పవర్ అని ఆయన చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలను లూటీ చేశారు. విద్యుత్ సంస్థల నుంచి కూడా కమీషన్లు దండుకుంటున్నారు.
మద్యం మీద జగన్మోహన్ రెడ్డి రూ. 28 వేల కోట్లు కొట్టేశారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు ఎందుకు లేవు? బీచ్ సాండ్ ద్వారా రూ.12 వేల కోట్లు కొట్టేశారు. విశాఖలో రుషికొండను పూర్తిగా ఆక్రమించేశారు అని ఆయన తెలిపారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఏనాడు తప్పు చేయలేదు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఇప్పటికీ తప్పు చూపించలేకపోయారు అని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.