ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే అజ్మీర్ దర్గాను సందర్శించే అజ్మీర్ యాత్ర సఫలీకృతం కావాలనీ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు సోమవారం అజ్మీర్ యాత్రకు వెళ్తుండగా స్థానిక మీ సేవ కార్యాలయం వద్ద మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి యాత్ర బస్సును ప్రారంభించారు.
మొదట యాత్ర సందర్భంగా ముస్లిం సోదరులు సమర్పించే చాధర్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రమంతా సంక్షేమ పథకాలతో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని..ఈ పథకాలు బీఆర్ఎస్ పార్టీ ద్వారా దేశమంతా వెళ్ళాలని ప్రార్థనలు చేయనున్నట్లు తెలిపారు.
ఈ యాత్రలో మొత్తం 75 మంది ముస్లిం సోదరులు వెళ్తున్నారని, వీరి యాత్ర సఫలం కావాలని, కోరుకున్న కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సర్వ మతాలను గౌరవించేది, అన్ని మతాలను సమానంగా చూసేది తెలంగాణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, సుడ చైర్మన్ జీవీ రామకృష్ణ రావు, బీ ఆర్ ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్, మైనారిటీ సెల్ నాయకులు యూసుఫ్, శౌకత్, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.