ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 28 దరఖాస్తులను ప్రజల నుండి స్వీకరించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా గిరిజన సంక్షేమ శాఖ నుండి అధికారులు ఎవరూ కూడా ప్రజావాణికి హాజరు కాకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణి పట్ల అలసత్వం వహించిన జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూకు ఆదేశించారు.
అదేవిధంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలాల వారీగా నిర్వహిస్తున్న ప్రజావాణిలో పెద్దకొత్తపల్లి తాహసిల్దార్, కొల్లాపూర్ ఆర్డిఓ స్పందించకపోవడంతో వారిద్దరికీ షోకాజ్ నోటీస్ జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు
జిల్లా అధికారులు తమకు కేటాయించిన మండలాల్లో విధిగా హాజరు కావాలని, ప్రజల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు.
ప్రజావాణి పట్ల అలసత్వం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మను చౌదరి, రాజేష్ కుమార్, కలెక్టరేట్ ఏవో శ్రీనివాసులు వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్ జిల్లా