కరోనా సమయంలో నిరుపేదలకు ఆయుష్మాన్ భారత్ వరంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దీని వల్ల కోటి మంది నిరుపేదలు చికిత్స పొందారని ఆయన మన్ కి బాత్ కార్యక్రమంలో వెల్లడించారు.
ఆయుష్మాన్ భారత్ లో చికిత్స పొందిన కోటి మంది నిరుపేద లబ్ధిదారుల్లో 80 శాతం మంది గ్రామీణులేనని ఆయన అన్నారు. కరోనా సమయంలో వలస కూలీల తరలింపునకు శ్రామిక్ రైళ్లు నడుపుతున్నామని ప్రధాని తెలిపారు.
‘కరోనా సమయంలో ఎందరో కొత్త కొత్త ఆవిష్కరణలకు నాంది పలికారు. అన్ని రంగాల వారు విశేష కృషి చేస్తున్నారు. మాస్కులు తయారు చేసి మహిళా సంఘాలు చేయూతనిచ్చాయి. విద్యా రంగంలోనూ ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేశారు’ అని మోడీ చెప్పారు.’కరోనా సమయంలో పేదల కష్టాలు వర్ణనాతీతం.
కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోంది. కాగా, మిడతల దండు దాడి వల్ల నష్టపోయిన వారిని ఆదుకుంటాం’ అని ప్రధాని మోడీ తెలిపారు. కరోనా విజృంభణ నేపథ్యంలో భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ‘కరోనాపై దేశ ప్రజలంతా పోరాటం చేస్తున్నారు.
ఈ పోరాటం మరింత సమర్థంగా కొనసాగించాలి. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి. మాస్కులు ధరించాలి. కరోనా వైరస్ శ్వాస వ్యవస్థను దెబ్బతీస్తుంది.. యోగా ద్వారా దీన్ని అధిగమించవచ్చు’ అని చెప్పారు.