తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం లోని తూప్రాన్ లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన విజయవంతమైంది. గత వారం రోజుల క్రితం మోడీ పర్యటనకు షెడ్యూల్ ఖరారు కాగా ఏర్పాట్లు చాలా చురుకుగా జరిగాయి. తూప్రాన్ గడ్డపై రాజేంద్రుడి గెలుపుకు బాసటగా నరేంద్రుడు వచ్చిన సందర్భంగా జరిగిన అపూర్వ సన్నివేశం చూపరులను విశేషంగా ఆకర్షించింది.
కెసిఆర్ రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన గజ్వేల్ నియోజకవర్గంపై ఒకరకంగా ఈటల రాజేందర్, నరేంద్ర మోడీలు దండయాత్ర చేశారని చెప్పవచ్చు. చివరి క్షణం వరకు పోటీ సభలను పెట్టి మోడీ సభను నిర్వీర్యపరచాలని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ లు ఎన్నో… ఎన్నెన్నో… ప్రయత్నాలు చేశారు. అవన్నీ విఫలం కాక తప్పలేదు. హైదర్గూడా దగ్గర జరిగిన ఈ సభకు దాదాపుగా రెండు లక్షల పైగా జనం హాజరైనట్టుగా స్థానికులు చెబుతున్నారు. వందల ఎకరాల్లో సభా వేదిక, హెలిప్యాడ్ ఏర్పాటు చేయగా, పదుల ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. కచ్చితంగా సమయ పాలన పాటించిన మోడీ రెండు గంటలకు తన ఉపన్యాసం ప్రారంభించి 45 నిమిషాలు ఏకధాటిగా కెసిఆర్ ప్రభుత్వంపై, కెసిఆర్ కుటుంబ అరాచకాలపై, బంగారు తెలంగాణ అనే కల్పిత భ్రమను పటాపంచలు చేస్తూ మాట్లాడారు. కల్వకుంట్ల కుటుంబాన్ని పూర్తిగా జైలుకు పంపించే గ్యారెంటీని అయన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు. మోడీ గ్యారెంటీ అంటే నిజమైన గ్యారెంటీ అని స్పష్టం చేశారు.
చెదిరిపోయిన తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని, ప్రభుత్వ అలసత్వాన్ని, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, సామాన్య ప్రజలకు, ఇతర అన్ని వర్గాల వారికి జరిగిన ఇబ్బందులను మోడీ తనదైన శైలిలో ప్రజల కళ్ళ ముందు ఉంచారు. ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలను పక్కన కూర్చుండబెట్టుకొని “నా తెలంగాణ కుటుంబ సభ్యులారా!” అంటూ ఈ చేసిన భాషణ చూసిన, విన్న ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. మోదీ మధ్య మధ్యలో తెలుగులో సంభాషించడంతో ప్రజానీకంలో నూతన ఉత్సాహాన్ని కల్పించింది.
తెలంగాణ రాష్ట్రానికి తొలి బీసీ ముఖ్యమంత్రిని తాను దగ్గరుండి గెలిపించుకుంటానని మోడీ చెప్పగా, ఈటలను సీఎం… సీఎం… అంటూ ఎత్తున కార్యకర్తలు, ప్రజలు నినాదాలు చేశారు. వచ్చిన ప్రజానీకాన్ని మోడీ ఈటలకు చూపుతూ ఆనందం వ్యక్తం చేయడం పలువురిని ఆకర్షించింది. తూప్రాన్ గడ్డమీద కమలం పువ్వు వికసించడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కీలకమైన అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సభ రాబోయే తెలంగాణ రాజకీయ పరిణామాలకు దిక్సూచి కాగలదని తెలుస్తోంది. స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఈటెల రాజేందర్ ను ఎమ్మెల్యేను, ముఖ్యమంత్రిని చేసుకుంటామని ముక్తకంఠంతో ప్రకటించడం ఈ సభ విశేషం.