ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తన 96వ ఎడిషన్ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ ఏడాది ఆయన చివరి ‘మన్ కీ బాత్’ కూడా ఇదే. దేశ ప్రజలకు ప్రధాని మోదీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 98వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుని నివాళులర్పించారు. గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, ఈ సంవత్సరం భారతదేశం సాధించిన విజయాలను ప్రస్తావించారు.
2022 సంవత్సరం అద్భుతంగా ఉందని, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిందని, ‘అమృత్ కాల్’ ప్రారంభమైందని అన్నారు. భారతదేశం ఈ సంవత్సరం వేగవంతమైన పురోగతిని సాధించింది. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మన్ కీ బాత్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విద్య, విదేశాంగ విధానం, మౌలిక సదుపాయాలతో సహా ప్రతి రంగంలో భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారని అన్నారు. ఆయన 98వ జయంతి సందర్భంగా ఆయనకు వినమ్రంగా ప్రణామం చేస్తున్నానని ఆయన అన్నారు.