పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రజలు పాకిస్తాన్ సైన్యంపై తిరుగుబాటు చేశారు. గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో సైనికులు తమ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా అక్కడి స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో భాగం అయిన ఈ ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అలాంటి పరిస్థితిలో ప్రభుత్వం కరెంటు కోత విధించింది. కరెంటు లేకపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దానికితోడు రేషన్ ను కూడా ప్రభుత్వం నిలిపివేసింది.
దాంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిల్గిత్-బాల్టిస్తాన్లో నిరసనకారులు తమ చేతుల్లో లాంతర్లతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు కూడా చేశారు. బాల్టిస్తాన్ అవామీ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు పలువురు రాజకీయ, సామాజిక కార్యకర్తలు నగరంలోని హుస్సేనీ చౌక్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చలి తీవ్రతతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నా కూడా 22 గంటల పాటు విద్యుత్ కోత విధిస్తున్నారు. ఇది కాకుండా ప్రజలు గోధుమ కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు తీర్చకుండా పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడకు సైన్యాన్ని పంపింది. అక్కడి ఉద్యమాలను అణచివేసేందుకు వచ్చిన సైన్యం గుడారాలు వేసుకుంటుండగా స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ సైనికులను తిరిగి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు.