గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని భాపణయ్య నగర్ స్మశాన వాటిక (మర్రి గుంట) సమస్యలకు వేదికగా మారింది. భాపణయ్య నగర్ కు సమీపంలోని వారంతా ఈ స్మశాన వాటికలో మృత దేహాలను పూడ్చి పెడుతున్నారు. వర్షం పడితే పెద్ద ఎత్తున నీరు నిలిచి పోతోంది.
స్మశానానికి ప్రహరీ గోడ కూలి పోవటంతో ఆకతాయిల ఆగడాలకు కేరాఫ్ గా మారింది. ఏళ్ళు గడుస్తున్నా లైట్లు ఏర్పాటు చేయక పోవటంతో రాత్రుళ్ళు అంధకారం రాజ్యమేలుతున్నది.
స్మశానంలో ఆక్రమణలు పెరిగి పోతుండటంతో స్మశాన వాటిక వైశాల్యం కుదించుకుపోతోంది. స్మశాన వాటిక లో సమస్య ల పరిష్కారం పై అధికారులు దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు.
దీనితో స్మశాన వాటిక కు వచ్చేవారికి అవస్థలు తప్పటం లేదు. ఇప్పటికైనా భాపణయ్య నగర్ స్మశాన వాటికలో సమస్యలు పరిష్కరించడం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.