తిరుపతి నగరంలోని డి.ఆర్ మహల్, వెస్ట్ చర్చి కాంపౌండ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రాంతాల్లో వర్షపు నీరు బయటకు వెళ్ళలేక రోజుల తరబడి చెరువులను తలపిస్తూ వాహన రాకపోకలకు, పాదచారులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాయలచెరువు రోడ్డు లోని రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం తగు జాగ్రత్తలతో పూర్తి చేయాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. వెస్ట్ చర్చి కాంపౌండ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ లో ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా నీరు చేరడంతో లోతు తెలియక బ్రిడ్జి మధ్యలో కారు చిక్కుకుపోయి ఒక మహిళ మరణించిందని ఆయన గుర్తు చేశారు.
రాయలచెరువు రోడ్డు లోని రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా అత్యాధునిక టెక్నాలజీతో వర్షపునీరు గంటల వ్యవధిలో బయటకు వెళ్లేలా చూడాలని ఆయన కోరారు. రైల్వే అండర్ బ్రిడ్జి లలో పాదచారులకు, వాహనాలు నడిపే వారికి వర్షపు నీటి లోతు తెలిసేలా ప్రమాదపు హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
తిరుచానూరు పాత రోడ్డు కు అనుసంధానంగా వెంకటేశ్వర టాకీస్ వద్ద ఉన్న రైల్వే గేట్ పూర్తిగా మూసివేయడంతో సాంప్రదాయంగా బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల నుంచి ఊరేగింపు గా పద్మావతి అమ్మవారికి తీసుకెళుతున్న “కాసుల హారం” “సారే” మరొక మార్గం గుండా తిరుచానూరుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. వెంకటేశ్వర థియేటర్ రైల్వే గేట్ మూసివేత కారణంగా తిరుచానూరు ఆలయానికి వెళ్లే భక్తులు,పరిసర ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు రైల్వే అండర్ బ్రిడ్జ్ (లేక) ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంపై రైల్వే అధికారులు దృష్టి సారిస్తే తిరుపతి ఓవర్ బ్రిడ్జి పై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని ఆయన సూచించారు.