తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయ శంకర్ సారు ఆశయాల సాధన దిశగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో పాలన కొనసాగుతోందని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, డిసిసిబి డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. జయ శంకర్ జయంతి వేడుకల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి కూడలిలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయ శంకర్ విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘననివాళి అర్పించి, ఆయన చేసిన త్యాగాలను నెమరు వేసుకున్నారు. అనంతరం గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో పోరాడిన జయ శంకర్ ఆశయాలకు అనుగుణంగానే మన నీళ్లు సాధించుకోగలిగామని, నియామకాలు చేపట్టడం జరుగుతుందని, మన నిధులు మనమే ఉపయోగించుకుంటున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం జయ శంకర్ సార్ తన జీవితాన్నే త్యాగం చేశారని గుర్తు చేశారు. చనిపోతూ సైతం రెండు రాష్ట్రాలకు వనరులు ఉన్నాయనే అంశంపై ఓ పుస్తకాన్ని సైతం రాయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ రాకుండా ఉంటే తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందిఉండేదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.