హైదరాబాద్ నగరంలో సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో ఈ నెల 9న ఆరేళ్ళ చిన్నారి చైత్ర పై రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేయడం పై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గోపాలపురం గ్రామంలో విన్నపం ఒక పోరాటం సంస్థ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకురాలు లీలావతి చీకూరి మాట్లాడుతూ మానవ మృగాలు రోజురోజుకి పెరుగుతున్నాయని, ఆడపిల్లలను అత్యాచారం చేశారనే వార్తలు నేడు నిత్యం భారతదేశంలోని ఏదో ఒక రాష్ట్రంలోనో,ఏదో ఒక మూలన జరుగుతూనే ఉందని అన్నారు. ఏరోజు తిరిగేసినా వార్తా పత్రికలలో ఆడపిల్లల జీవితాలు ఛిద్రమై పోతున్నా ప్రభుత్వాలలో మార్పు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వాలు యువతను మద్యం మత్తుకి బానిసలుగా తయారు చేస్తుందని, యువత గంజాయి మత్తులో పడి పెడదోవ పట్టే విధంగా తయారు చేస్తున్నారని, ప్రభుత్వాలు ఆడపిల్లలను రక్షించడంలో చిత్తశుద్ధి కరువైపోయిందని అన్నారు.
ఎవరి కులం ఆడపిల్ల బలే అయితే వారే న్యాయం కోసం పోరాడాలి అనే విధంగా ప్రజలను తయారు చేశారని,ఎవరి చేతిలో బలైపోతే మాకేంటి మా కులం కాదుగా అని మౌనంగా మారి మానవ విలువలు దిగజారాయని అన్నారు.
ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగినా ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు ఏకతాటిపై ఉండి శిక్ష పడే విధంగా చూడాలని,చైత్ర సంఘటన మరల పునరావృతం కాకుండా ఉండాలంటే ఇరవై రోజుల్లో మరణశిక్ష విధించే విధంగా ప్రభుత్వం తగిన కఠిన చర్యలు తీసుకోవాలని,గోపాలపురం గ్రామంలో చైత్ర సంఘటనను నిరసిస్తూ విన్నపం ఒక పోరాటం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చీకూరి నాగలక్ష్మి,బోర రాధిక,ప్రణతి, హైమావతి,పద్మ,మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్