జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు మిలాకతై బడ్జెట్ ను ఆమోదించుకున్నారని జిహెచ్ఎంసి కాంగ్రెస్ కార్పొరేటర్లు మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి , ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి (ఫ్లోర్ లీడర్ )పి విజయ రెడ్డి ,శీరీష్ సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. బడ్జెట్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ కార్పొరేటర్లు గ్రేటర్ కార్యాలయం ముందు ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడ్జెట్ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడేది కాదన్నారు. ఎలాంటి చర్చలు జరగకుండా బడ్జెట్ ఎలా ఆమోదం పొందుతుందని ప్రశ్నించారు.
బీజేపీ కార్పొరేటర్లు కౌన్సిల్ లో అసందర్భ అంశాలను మాట్లాడి అసలు లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలు, ఇతర డిమాండ్లను పట్టించుకోలేదని కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ముందస్తు ఒప్పందంలో భాగంగానే జరిగినట్టుగా అనుమానం వ్యక్తం చేశారు. నగరంలో మలేరియా, డెంగ్యూ జ్వరాలతో ప్రజల ప్రాణాలు పోతుంటే జీహెచ్ఎంసీ కనీస నివారణ చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. నగరంలోని ప్రభుత్వ భవనాలకు ఆస్తి పన్ను జీహెచ్ఎంసీకి చెల్లించాలని డిమాండ్ చేశారు. చివరకు ప్రగతి భవనానికి కూడా ఆస్తి పన్ను చెల్లించడం లేదని ఆరోపించారు. జీహెచ్ఎంసీని ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందన్నారు. ఈ అప్పులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందు కాంగ్రెస్ కార్పొరేటర్లు కార్యాలయంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. అనంతరం అదే ప్లకార్డులతో సమావేశానికి వెళ్లారు.