సామాన్య ప్రజలకు మరింత సుళువుగా రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు ముందుకు రావాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి కోరారు. అన్ని అర్హతలు ఉన్నవారికి, రుణమంజూరు ప్రక్రియను సులభతరం చేయాలని సూచించారు. క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమంలో భాగంగా,నగరం లోని ఓప్రైవేటు కల్యాణమండపంలో జిల్లా లీడ్బ్యాంకు, భారతీయ స్టేట్ బ్యాంకు ఆధ్వర్యంలో రుణ వితరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జరిగింది. ఈ రుణవితరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక అక్షరాశ్యత ప్రతీఒక్కరికీ అవసరమన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకు సేవలు ప్రజలకు చేరువ అయ్యాయని చెప్పారు. రుణం తీసుకొనే విధానం, బ్యాంకు కార్యకలాపాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ బ్యాంకులతో ముడిపడి ఉన్నాయని, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే, బ్యాంకుల సహకారం అవసరమని స్పష్టం చేశారు. బ్యాంకులనుంచి తీసుకున్న రుణాలను సక్రమంగా, సకాలంలో తిరిగి చెల్లించాలని ప్రజలను ఈసందర్భంగా కలెక్టర్ కోరారు.
ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలకోసం ఎదురు చూడకుండా, అందుబాటులో ఉన్న బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని, పెట్టుబడి పెట్టడం ద్వారా వ్యాపారాభివృద్దికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.ఎస్బిఐ డిజిఎం(అమరావతి) ఎ.వెంకటరామయ్య మాట్లాడుతూ, అర్హత ఉన్నవారందరికీ రుణాలను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు బ్యాంకుల పరంగా కృషి చేస్తున్నామని చెప్పారు.లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎం.శ్రీనివాసరావు, ఎస్బిఐ రీజనల్ మేనేజర్ డి.రాజారాం మోహనరావులు కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో నాబార్డు డిడిఎం పి.హరీష్, ఎస్బిఐ డిజిఎం మన్మయ పండాబ్, యూనియన్ బ్యాంకు డిజిఎం పి.కృష్ణయ్య, బ్యాంకు ఆఫ్ బరోడా ఆర్ఎం వైవిఎస్ కోటేశ్వర్రావు, ఎపిజివిబి ఆర్ఎం టిజి నాగేశ్వర్, ఎస్బిఐ ఆర్ఎం అబ్దుల్ హసీబ్ అమిర్, డిప్యుటీ వైస్ ప్రెసిడెంట్ సందీప్ పట్నాయక్, డిసిసిబి సిఇఓ కె.జనార్ధన్, డిఆర్డిఏ పిడి డాక్టర్ ఎం.అశోక్ కుమార్, ఎపిడి సావిత్రి, మెప్మా పిడి బి.సుధాకరరావు, పలువురు బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.