పాలకుల వైఖరితో ప్రభుత్వ విద్యావ్యవస్థ సంక్షోభంలోకి కూరుకుపోయిందని పాలకులే ప్రైవేటు, కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు పోటు ప్రసాద్ ఆరోపించారు. ప్రభుత్వ విద్యను క్రమేపి నిర్వీర్యం చేసి పేద, మధ్యతరగతి ప్రజలకు విద్యను దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సమావేశం స్థానిక సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పోటు ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశంలోని ఫెడరల్ సూత్రాలకు భిన్నంగా ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా బిజెపి నూతన జాతీయ విద్యా విధానాన్ని తెరమీదకి తెచ్చిందన్నారు. 21వ శతాబ్దంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో సమాజం పురోగమిస్తున్న క్రమంలో మధ్యయుగం నాటి చాందస వాదాన్ని పాఠ్యాంశాలుగా చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తుందని ప్రసాద్ ఆరోపించారు. మతం, కులం ద్వారా లబ్ది పొందాలనుకునే బిజెపి దానిని విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే నేర్పించే కుట్రకు పాల్పడుతుందన్నారు. ప్రైవేటు విద్యావ్యవస్థకు పాలకులు శ్రీరామరక్షగా నిలబడుతున్నారని క్రమేపి ప్రభుత్వం విద్య నుంచి వైదొలగేందుకు ప్రయత్నిస్తుందని ఆయన తెలిపారు. యుజిసి రద్దు మొదలు ప్రతి విషయంలోను ప్రభుత్వ విద్యా వ్యతిరేక వైఖరి స్పష్టమవుతుందన్నారు. ఇప్పుడు విద్యా, వైద్యం లాభసాటి వ్యాపారాలుగా మారాయని ప్రసాద్ ఆరోపించారు.
ఓ దశాబ్ద కాలం తర్వాత ప్రభుత్వ విద్య కనపడదని ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో పాఠశాలల కుదింపు లేదా ఎత్తివేత ప్రారంభమైందన్నారు. విద్య విషయంలో బిజెపి, బిఆర్ఎస్ దొందూ దొందేనని నాణ్యమైన విద్యను అందించడంలో విఫలమయ్యాయన్నారు. దేశ వ్యాప్తంగా విద్యా రంగంలోని ఖాళీలను పూర్తి చేయకుండా బోధన ఎలా సాధ్యమవుతుందని ప్రసాద్ ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాలపై పోరాటాలు చేసి ప్రభుత్వ విద్యా పరిరక్షణకు ఏఐఎస్ఎఫ్ ముందు వరుసలో నిలబడాలని అందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ప్రసాద్ పిలుపునిచ్చారు. విద్యార్థి పోరాటాలే ప్రభుత్వ గతిని మార్చగలవని ఆయన స్పష్టం చేశారు. ఈ కౌన్సిల్ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు, కార్పొరేటర్ బిజి క్లెమెంట్, ఏఐఎస్ఎఫ్ నాయకులు రావి శివరామకృష్ణ, ఎస్ఎ స్టాలిన్ తదితరులు ప్రసంగించగా కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్, రాష్ట్ర సమితి సభ్యులు ఇటికాల రామకృష్ణ, రెహ్మన్, బరిగల వెంకటేష్, క్రాంతి, రఘురాం, లెనిన్, రాజు, నాగజ్యోతి, జిల్లా నాయకులు మడుపల్లి లక్ష్మణ్, సంతోష్, మురళికృష్ణ తదితరులు పాల్గొన్నారు. కౌన్సిల్ సమావేశంలో ప్రజానాట్యమండలి కళాకారుడు రాము అలపించిన గేయాలు ఆకట్టుకున్నాయి.