చిత్తూరు జిల్లా పుంగనూరులోని కోనేటిపాళ్యంలోని శ్రీ కల్యాణ వేంకటరమణస్వామివారి ఆలయాన్ని టిటిడిలోకి విలీనం చేసుకునే కార్యక్రమం శనివారం జరిగింది. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో ఈ విలీన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అనంతరం రాష్ట్ర దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రమౌళి ఆలయానికి సంబంధించిన రికార్డులు, ఇతర పత్రాలను టిటిడి డెప్యూటీ ఈవో శాంతికి అందజేశారు. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ సముదాయంలో ఈ ఆలయాన్ని చేర్చారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు రెడ్డెప్ప, టిటిడి ఏఈవో ధనంజయులు, మున్సిపల్ కమిషనర్ వర్మ, నియోజకవర్గ ప్రత్యేకాధికారి రాజశేఖర్నాయుడు, ఆలయ ఈవో కమలాకర్, సూపరింటెండెంట్లు నటరాజు చెంగల్రాయలు, అర్చకుడు బాలాజి రంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు.