రాజధాని కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తికి అనుభవం, లేకపోయినాప్పటికీ, వందమంది చిల్లర సలహాదారులను పెట్టుకొని, విజయకుమార్ వంటి న్యాయ మాంత్రికుని కలిశారని మీడియా కోడై కోస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి కాపురం… కొత్త కాపురం అని పాట పాడడం సమంజసమా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని నరసాపురం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామ కృష్ణంరాజు ప్రశ్నించారు.
కాపురం… కొత్త కాపురం, ఆలుమగలు కట్టుకున్న అనురాగ గోపురం అని సినిమాలో పూరి గుడిసె వేసుకున్న హీరో కృష్ణ, హీరోయిన్ భారతి పాడుకుంటే, జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి దంపతులు బెంగుళూరు, హైదరాబాదు, ఇడుపులపాయ, తాడేపల్లి లలో ప్యాలెస్ లు నిర్మించుకొని పాట పాడుకున్నారెమో. విశాఖపట్నంలో మరొక కోట నిర్మించుకొని సెప్టెంబర్ లో అదే పాట పాడుకుంటారెమో. కొత్త కోట లో కాపురం పెట్టబోయే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చిరు సిగ్గుతో ప్రజలకు తెలియజేయడం అద్వితీయం.
జగన్మోహన్ రెడ్డి ప్రకటనతో, విశాఖ ప్రజల ముఖాలలో ఆనందం ఆవిరయ్యింది. ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కట్టుకున్నారు… ఇడుపులపాయ ఏమైనా రాష్ట్ర రాజధాని అయ్యిందా?, ఇప్పుడు విశాఖలో కోటను నిర్మించుకునే పనిలో ఉన్నారు. సెప్టెంబర్ లోగా ప్యాలెస్ నిర్మాణ పనులు పూర్తి కాకపోవచ్చు. పూర్తి అయిన వెంటనే, ఆయన విశాఖపట్టణం కోట లోకి పాలు పొంగించుకుని, లేదంటే కేకులు కట్ చేసి గృహప్రవేశం చేయవచ్చు. దానివల్ల పెద్దగా ఫరక్ పడేది ఏమీ లేదు.
రాష్ట్ర రాజధాని ఏమీ మారదు. రాయలసీమలో ఒక ప్యాలెస్ ఉన్నట్లుగానే, ఉత్తరాంధ్రలోను ఆయనకు మరొక ప్యాలెస్ ఉంటుంది. అలాగే కోస్తాను, హైదరాబాదులో విలాసవంతమైన భవంతులు ఉన్నాయి. తాజాగా చెన్నైలోనూ మరొక ప్యాలెస్ నిర్మిస్తున్నారట. ఎందుకంటే తమది జాతీయ పార్టీ కాబట్టి అని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు. గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాజధాని కేసు వేసిన పిటీషన్ దారులు ముఖ్యమంత్రి కొత్త కాపురం ముచ్చట్లను సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్తే బాగుంటుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అమరావతి అన్ని జోన్ ల కేసు విచారణకు రాగా, రైతుల తరఫున దేవదత్ కామత్ చక్కటి వాదనలను వినిపించారు. అమరావతిలో నవ నగరాలను నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖపట్నంలో కొత్త కాపురం పెట్టాలను కుంటున్న జగన్మోహన్ రెడ్డి, అమరావతి నవనిర్మాణ యజ్ఞాన్ని మారీచ, సుభాహు అనే రాక్షసుల మాదిరిగా విఘ్నం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
ప్రతిపక్ష పార్టీల నాయకులను మారీచులు అని సంబోధించే ముఖ్యమంత్రి, అమరావతి నిర్మాణ యజ్ఞాన్ని అడ్డుకునేందుకు మారీచుడి అవతారం ఎత్తగా, ఆయనకు సుభాహు అనే రాక్షసుడిలా సజ్జల రామకృష్ణారెడ్డి తోడయ్యారు. అమరావతి నవ నగరాల నిర్మాణ యజ్ఞాన్ని , రాజధాని నగరంలో గుడిసెలు వేయించి అడ్డుకోవాలని చూస్తున్నారు. గత నాలుగేళ్ల క్రితం పూర్తయి, ప్రారంభించిన ఇళ్లను కూడా తానే నిర్మించినట్లు జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం దారుణం. గత ప్రభుత్వ హయాంలో 90 శాతం నిర్మాణం పూర్తయి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధి దారులకు జగన్మోహన్ రెడ్డి అందించలేకపోయారు.
అటువంటి జగన్మోహన్ రెడ్డి, రాజధాని నగరంలోని 1134 ఎకరాలలో గుడిసెలు వేయించాలనే పథకరచన వెనుక కుట్ర కోణం స్పష్టమవుతుంది. పేదవాడికి ఇంటి స్థలాన్ని ఇవ్వడానికి ప్రతిపక్షాలు అడ్డుపడు తున్నాయని ఆయన పేర్కొంటుంటే నవ్వొస్తుంది. హైకోర్టులో న్యాయం జరగకపోతే, సుప్రీంకోర్టును ఆశ్రయించాలి. గతంలో హైకోర్టు తాను ఇచ్చిన తీర్పును తానే పరిగణలోకి తీసుకోకపోవడం అన్నది జరగకపోవచ్చు.
రాజధాని నగరంలో నిజంగానే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని భావిస్తే, మరొక వెయ్యి ఎకరాల భూమిని సేకరించి, ఇళ్ల స్థలాలను కేటాయించాలి. రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలో కడప, కర్నూలు, చిత్తూరు, పలాస ప్రాంతాలకు చెందిన ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెబుతున్న జగన్ మోహన్ రెడ్డి, తాను మాత్రం తన కాపురాన్ని విశాఖపట్నం మారుస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అమరావతి నగర నిర్మాణం పట్ల జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు. ఎలాగైనా అమరావతిని విధ్వంసం చేయాలన్నదే ఆయన ఎత్తుగడగా కనిపిస్తోందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు.