ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు విజయసాయిరెడ్డిని సీబీఐ పిలిచి విచారణ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు.
వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి ఆయన గుండెపోటుతో మరణించినట్లు చెప్పారని రఘురామ అన్నారు.
దారుణంగా హత్యకు గురై రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని గుండెపోటుతో మరణించినట్లు విజయసాయిరెడ్డి ఎందుకు చెప్పారో సీబీఐ ప్రశ్నించాలని రఘురామ డిమాండ్ చేశారు.
వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించినట్లు విజయసాయి రెడ్డికి ఎవరు సమాచారం ఇచ్చారో సీబీఐ దర్యాప్తు చేయాలని రఘురామ డిమాండ్ చేశారు.
విజయసాయిరెడ్డికి ఆ సమాచారం ఇచ్చిన వారు ఎవరో తెలుసుకుంటే కేసు చిక్కుముడి త్వరగా వీడుతుందని ఆయన అన్నారు.