సినిమా కంటెంటు ఏమిటో చెప్పకుండా కేవలం టైటిల్ తోనే జనాన్ని ఆకట్టుకుందామని ప్రయత్నించే రామ్ గోపాల్ వర్మకు ఊహించని షాక్ తగిలింది. ప్రపంచంలోనే తొలి సారిగా ట్రయిలర్ కు కూడా డబ్బులు వసూలు చేద్దామన్న రామ్ గోపాల్ వర్మ ఆలోచనకు బ్రేక్ పడింది. పవర్ స్టార్ అనే చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
పోస్టర్లు అన్నీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను, ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవిని పోలి ఉన్న డూప్ లను తీసుకువచ్చి నింపేసిన రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ చిత్రంపై జనానికి ఆసక్తి పెంచేశాడు. అంతే కాకుండా పవన్ కల్యాణ్ భార్య అయిన విదేశీ వనితను పోలిన మనిషిని తీసుకువచ్చిన రామ్ గోపాల్ వర్మ వారిద్దరూ కలిసి కూర్చున్న పోస్టర్ ను కూడా విడుదల చేసి ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయాలు కూడా ఉన్నట్లు చెప్పకనే చెప్పాడు.
పైకి మాత్రం పవన్ కల్యాణ్ జీవిత చరిత్ర కాదు అని చెప్పినా పోస్టర్లు అన్నీ అలానే ఉండటంతో జనానికి ఆసక్తి పెరిగింది. దాంతో ఈ చిత్రం ట్రయిలర్ ను నేడు విడుదల చేద్దామని రామ్ గోపాల్ వర్మ ప్లాన్ చేసుకున్నాడు. అయితే ట్రయిలర్ ను ఉచితంగా చూపిస్తే సినిమాకు క్రేజ్ ఏమి ఉంటుందనే ఆలోచనతో ట్రయిలర్ చూసేందుకు ఓటీటీలో 25 రూపాయలు చెల్లించాలని కండిషన్ పెట్టాడు.
ఈ చిత్రం ఈ నెల 25న ఓటీటీలో విడుదల అవుతున్నది. ట్రయిలర్ విడుదల కాకముందే ఎవరో ట్విట్టర్ లో లీక్ చేసేశారు. దాంతో రామ్ గోపాల్ వర్మకు షాక్ తగిలింది. దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిన రామ్ గోపాల్ వర్మ ట్రయిలర్ చూసేందుకు డబ్బులు కట్టినవారికి తిరిగి ఇచ్చేందుకు కూడా రామ్ గోపాల్ వర్మ యోచిస్తున్నట్టు తెలిసింది.