షెడ్యూల్డ్ ఏరియాలలో గిరిజనుల భూములను ఆక్రమించిన రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తే వార్త ఇది. చాలా కాలంగా అమాయకులైన గిరిజనులను మోసం చేస్తూ వారి భూములను అనుభవిస్తున్న వారి గుట్టు రట్టు చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
మరీ ముఖ్యంగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్ లోని ఒక మంత్రి చాలా కాలంగా షెడ్యూల్ ఏరియాలోని గిరిజన భూములను అక్రమంగా అనుభవిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన జీలుగుమిల్లి మండలంలో ఆ మంత్రికి వందలాది ఎకరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా షెడ్యూల్ ఏరియా భూములే కావడం గమనార్హం. షెడ్యూల్ ఏరియాలో గిరిజనులు మాత్రమే భూములు కలిగి ఉండాలని చట్టం చెబుతున్నది.
షెడ్యూల్ ఏరియాలో గిరిజనేతరులకు భూములు ఉండే అవకాశమే లేదు. అలాంటిది ఒక మంత్రికే ఇలా షెడ్యూల్ ఏరియాలో భూములు ఉండటంపై రఘురామకృష్ణంరాజు దృష్టి సారించినట్లు తెలిసింది. షెడ్యూల్ ఏరియాలో గిరిజనేతరులకు భూములు అమ్మడం, కొనడాన్ని వన్ ఆప్ సెవెంటీ చట్టం ప్రకారం నిషేధం. ఈ చట్టం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కాబట్టి నేరుగా కేంద్ర ప్రభుత్వమే విచారణ జరుపుతుంది.
పశ్చిమ గోదావరికి చెందిన ఒక మంత్రి ఆధీనంలో ఉన్న వందలాది ఎకరాల గిరిజన భూమిపై విచారణ జరిపే విధంగా రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రఘురామకృష్ణంరాజు వేస్తున్న ఈ ఎత్తుగడ ఫలిస్తే గిరిజన భూములను కొనుగోలు చేసి అనుభవిస్తున్న ఆ మంత్రి నెత్తిన బండపడినట్లే భావించవచ్చు. ఈ భూములన్నీ మంత్రి ఆధీనం నుంచి గిరిజనులకు చేరిపోతాయి.