కరోనాతో ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కార్మికులకు, చేతి వృత్తిదారులకు, పట్టణ, గ్రామీణ నిరుపేదలకు నెలకు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించి ఆదుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాల ధనంజయ నాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
శనివారం ఆయన హుజూర్ నగర్ లోని సిపిఐ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల డిమాండ్ల సాధనకు ఈ నెల 27వ తేదీన ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన తెలిపి, అధికారులకు వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
ప్రైవేటు ఆసుపత్రులలో లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి వైద్యం చేసుకునే పరిస్థితి ఇప్పుడు ప్రజలకు లేదని, అందువల్ల కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చి, ఉచితంగా వైద్యం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల సందర్భంగా 57 సంవత్సరాలు నిండిన వారికి 2000 రూపాయల పెన్షన్ ఇస్తామని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభలో ప్రకటించారని, కానీ ఇంత వరకు ఇచ్చిన హామీ అమలు కాలేదని ఆయన అన్నారు.
తక్షణమే పెన్షన్ అందించాలని, ఆసరా పెన్షన్ ల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది దరఖాస్తు చేసుకుని తాసిల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని,వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు.
కరోనా ను ఎదుర్కొనేందుకు అవసరమైతే వెయ్యి కోట్లు ఖర్చు పెడతామని బీరాలు పలికిన ముఖ్యమంత్రి కెసిఆర్ కేవలం 100 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు అని, మాస్కులు లేకుండా ప్రజల్లో తిరుగుదామని ప్రగల్బాలు పలికి ఇప్పుడు ఫామ్, హౌస్ కే పరిమితమయ్యారని, ప్రజలు అనారోగ్యంతో అల్లాడుతుంటే పట్టించుకోకుండా బంగారం లాంటి సచివాలయాన్ని కూల్చి వేస్తూ వెర్రి ఆనందాన్ని పొందుతున్నారని ఆయన విమర్శించారు.
ఆయన వెంట వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బండారు రాజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు రెమిడాల రాజు, కందుల వెంకటేశ్వర్లు జడ వెంకన్న తదితరులు ఉన్నారు.