విజయనగరం జిల్లా వ్యాప్తంగా వచ్చే నెల 1నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఇంటివద్దకే రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మండలస్థాయి అధికారులంతా సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ ఆదేశించారు.
ఈ పథకం అమలులో ఎదురయ్యే సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి వాటిని అధిగమించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తే ఆ తర్వాత నెలల్లో ఈ పథకం అమలు ఎంతో సులవవుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంటివద్దకే రేషన్ సరుకుల పంపిణీ చేపట్టే నిమిత్తం 458 సంచార వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఈ వాహనాలు మంజూరైన లబ్దిదారులతో గ్రామ రెవిన్యూ అధికారులను అనుసంధానం చేయడం ద్వారా వీరందరికీ పంపిణీపై తగిన అవగాహన కలిగించేందుకు శిక్షణ కార్యక్రమాలు మండల స్థాయిలో నిర్వహించాలన్నారు. జిల్లాలోని తహశీల్దార్లు, ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి ఈ పథకం అమలుకోసం చేయాల్సిన ముందస్తు ఏర్పాట్లపై సూచనలు చేశారు.
జిల్లా స్థాయిలో ఈనెల 21న మంజూరైన సంచార వాహనాల ప్రారంభ కార్యక్రమాన్ని నగరంలోని పోలీసు బ్యారెక్స్ లో నిర్వహిస్తున్నామన్నారు., ఈ కార్యక్రమంలో తహశీల్దార్లతో పాటు వాహనాలు మంజూరైన లబ్దిదారులు ఒకరోజు ముందే హాజరు కావాలన్నారు.
మండలాలకు సంచార వాహనాలు వచ్చిన తర్వాత వాటిని ఆయా మండలాల్లో ఏ రూట్లో నడపాలన్న విషయమై ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలన్నారు. 21న వాహనాలు ప్రారంభించిన వాహనాలు 22న ఆయా మండలాలకు చేరతాయని, వచ్చిన వాహనాలను ఒక చోట నిలిపి వుంచేందుకు తగిన ప్రదేశాన్ని గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాకు మంజూరైన 458 వాహనాలలో పార్వతీపురం డివిజన్కు 196, విజయనగరం డివిజన్కు 262 మంజూరయ్యాయని.. టాటా సంస్థ నుండి 315, మారుతి సుజుకి 143 వాహనాలు వచ్చాయన్నారు. ఈ మొబైల్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమ బాధ్యతను స్థానిక ఆర్.డి.ఓ. నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్సులో జాయింట్ కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి పాపారావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వరకుమార్, జిల్లా పంచాయతీ అధికారి సునీల్ రాజ్కుమార్, ఎస్.సి. కార్పొరేషన్ ఇ.డి. జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు.