తెల్లరేషన్ కార్డు లేని కూలీలందరికీ కరోనా సహాయం అందించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో ఉపాధి హమీ పనులను పరిశీలించి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కార్డులేని కూలీలందరికీ రేషన్ బియ్యం నిత్యావసర వస్తువులను సరఫరా చేయాలని కోరారు.
గ్రామ పంచాయితీ నుండి మాస్కులు శానిటైజర్ కూలీలందరికీ అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎర్రటి ఎండల్లో పనిచేస్తున్న కూలీలకు రూ. 100 నుండి 120 మాత్రమే దినసరి కూలీ పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు సమ్మర్ అలవెన్స్ 30 శాతం ఇవ్వాలని చట్టంలో ఉన్నా కలపడం లేదనీ తెలిపారు గడ్డపారలు మెున పెట్టుకున్నందుకు రావాల్సిన బిల్లులు కూడా రావడం లేదని ఆయన తెలిపారు.
మంచినీటి బిల్లులు కూడా కొంతమందికే పడుతున్నాయని తక్షణమే అధికారులు స్పందించి బిల్లులను ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు పనిచేస్తున్న మామిళ్ల భాగ్యమ్మకు కాలుకు గడ్డపార దిగిందని వారికి మెడికల్ బిల్లులు ఇవ్వాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు లాడే రాముల చిట్యాల మండల కార్యదర్శి అరూరి నరసింహమండల ఉపాధ్యక్షులు మెట్టు పరమేష్ పాల్గొన్నారు.