వైసీపీ పాలనలో నియోజకవర్గానికి ఒక సైకో తయారవుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. రౌడీయిజం చేస్తే తాటతీస్తానని, వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. ‘సాగునీటి ప్రాజెక్టుల సందర్శన’లో భాగంగా నంద్యాల జిల్లా పర్యటకు వెళ్లిన చంద్రబాబు నందికొట్కూరులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
‘‘రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్. బటన్ నొక్కుతున్నా అని పదేపదే చెబుతున్నారు. బటన్ నొక్కడం కాదు.. బటన్ బుక్కుడు ఎక్కువైంది. విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికి 8 సార్లు పెంచారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నూతన విద్యుత్ పాలసీ తీసుకొస్తాం. విద్యుత్ ఛార్జీలు తగ్గించే బాధ్యత నాది. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తాం.
ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. యువగళం సూపర్ హిట్ అయింది. యువతలో చైతన్యం వచ్చింది. తెదేపా ప్రభుత్వం వచ్చాక 20 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తాం. జాబు రావాలంటే.. బాబు రావాల్సిందే. నాసిరకం మద్యం సరఫరాతో పేదల రక్తం తాగుతున్నారు. పాతమద్యం విధానం తెచ్చి ధరలు తగ్గిస్తాం. నాసిరకం మద్యం నుంచి విముక్తి కల్పిస్తాం అని ఆయన తెలిపారు.
ముందుచూపుతోనే టీడీపీ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాం. హంద్రీనీవా, తెలుగు గంగ, ముచ్చుమర్రి, ఎస్ఆర్బీసీ ప్రాజెక్టులను టీడీపీనే ప్రారంభించింది. ప్రతి ఎకరాకు నీరివ్వాలని సంకల్పించా. రాయలసీమ కోసం జగన్ ఏనాడైనా పనిచేశారా? సీమకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్. రాయలసీమలో మేం రూ.12,400 కోట్లు ఖర్చు పెట్టాం. సీమ ద్రోహి జగన్ ఖర్చు చేసింది రూ.2వేల కోట్లే. సాగునీటి ప్రాజెక్టులపై యుద్ధభేరి ప్రకటించాలని వచ్చా.
ప్రాజెక్టుల్లో నీళ్లు లేకుండా చేసిన ఘనత జగన్ది. రోడ్డుకు మట్టి వేయలేరు కానీ, 3 రాజధానులు కడతారట. ఒక రాజధానిని నాశనం చేసి 3 రాజధానులంటున్నారు. మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నాం. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా జగన్ తీసుకొచ్చారా? జగన్.. పరదాల మాటున కాదు.. ధైర్యం ఉంటే ప్రజల్లోకి రావాలి. వైసీపీని భూస్థాపితం చేస్తే తప్ప మనకు న్యాయం జరగదని చంద్రబాబు అన్నారు