విద్యుత్ అధికారుల పై హత్య కేసు నమోదు చేయాలని తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా తలకొండ పల్లి మండలం చంద్రధన జూలపల్లి రహదారికి పక్కన ఉన్న తోటలో బుధవారం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక గిరిజన యువకుడు విద్యుద్ ఘాతానికి బలయ్యారని అధికారులపై హత్య కేసు నమోదు చేసి కటకటాలకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు.
నూతనంగా వివాహమై ఆరు నెలల పసిబిడ్డకు పితృవియోగం పట్టిందని దానికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. రైతుల అకౌంట్లో ఎకరాకు రెండు వేలు 3000 వేసి చేతులు దులుపుకుంటే సరిపోదని వారి ప్రాణాలకు రక్షణగా ఉండడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు.
గతంలో ప్రభుత్వాలు లక్షల రుణమాఫీని చేసేవారని ఇప్పుడున్న ప్రభుత్వం 2000 ,3000 వేసి బంగారు తెలంగాణ అని గొప్పలు చెప్పుకుంటూ ఉందని దుయ్యబట్టారు.రైతు ప్రాణాలంటే అధికారులకు లెక్క లేదని మానవత్వం లేదని మండిపడ్డారు.
రైతుల బ్రతుకులు మార్చడం అంటే ప్రాణాలు తీయడమా అని ప్రశ్నించారు. చాలా సందర్భాల్లో ఫిర్యాదు ఇచ్చిన అధికారులు పట్టించుకోవడం లేదని నిబంధనల ప్రకారం స్తంభానికి స్తంభానికి 50 అడుగుల దూరం ఉండాలి అయినను నిబంధనలను తుంగలో తొక్కి దూరం దూరం స్తంభాలు పాతరని అందువల్ల తీగలు కిందకు వేలాడుతున్నాయని ఫిర్యాదు చేసిన నేటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే చాలా మందిని పొట్టన పెట్టుకున్నారని ఇంకా ఎంత మందిని ఇలా పొట్టన పెట్టుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.