ఉట్నూరులో గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు సోయం బాపూరావు ప్రధాని నరేంద్ర మోడీకి వినతి పత్రం అందచేశారు. నేడు ఢిల్లీలో ప్రధానిని కలిసిన ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
ఆసిఫాబాద్ లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఆయన తన వినతి పత్రంలో కోరారు. అదే విధంగా సిసిఐ ఆధ్వర్యంలో సింమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ప్రధానిని కోరారు. ఆదిలాబాద్ లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని గిరిజనులు ఎక్కువ గా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి రూ.280 కోట్ల అభివృద్ధి నిధి ఇవ్వాలని ఆయన కోరారు.
ఆదిలాబాద్, నిర్మల్ పట్టణాలలో కేంద్ర పాఠశాలలు ఏర్పాటు చేయాలని సోయం బాపూరావు కోరారు. ముథోల్, ఆదిలాబాద్ పట్టణాలలో టెక్సటైల్ పార్కు ఏర్పాటు చేయాలని ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి వినతి పత్రం సమర్పించారు. లంబాడీలను ఎస్ టి జాబితా నుంచి తొలగించాలని ఆయన కోరారు. బాసరలోని సరస్వతీ దేవి ఆలయానికి ఒక్క సారి విచ్చేయాలని ప్రధానిని కోరారు.
ఎంపి బాపూరావుతో ప్రధాని నరేంద్రమోడీని కలిసిన వారిలో బీజేపీ కేంద్ర – రాష్ట్ర సమన్వయకర్త నూనె బాల్ రాజ్, నిర్మల్ జిల్లా బిజెపి అధ్యక్షురాలు డాక్టర్ పి రమాదేవి, ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షుడు పాయల శంకర్, సిర్పూర్ ఇన్ చార్జి డాక్టర్ నివాస్, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు సేడం గణపతి, ఆదివాసీ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్. రామకృష్ణ, ఆదివాసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సలహాదారుడు, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కె వీరమల్లు, తుడుం దెబ్బ సలహాదారుడు సేడం జంగు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ భూమయ్య తదితరులు ఉన్నారు.