ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కక్షపూరితంగా రాసిన లేఖను పరిగణనలోకి తీసుకోరాదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీనియర్ రిటైర్డ్ న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. ఈ మేరకు ఆయన నేడు ఒక లేఖ రాశారు.
రాజకీయ దురుద్దేశ్యంతో బురద చల్లే విధంగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ ఉందని జస్టిస్ (రిటైర్డ్) నౌషాద్ అలీ అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకులపై ఉన్న కేసులను సత్వరమే విచారించాలని సెప్టెంబర్ 16న జస్టిస్ ఎన్ వి రమణ ఆదేశాలు ఇచ్చినందునే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ లేఖ రాశారని జస్టిస్ (రిటైర్డ్) నౌషాద్ అలీ అన్నారు.
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాసిన లేఖ న్యాయవ్యవస్థ పై బురద చల్లడమేనని అందుకు చర్యలు తీసుకోవాలని ఆయన తన లేఖలో కోరారు. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి 31 కేసుల్లో నిందితుడని అందులో 11 కేసులు సీబీఐ విచారణ జరుపుతున్నదని ఆయన తెలిపారు.
అదే విధంగా మరో 7 కేసులు ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న కేసులు కూడా ఉన్నాయని ఆయన వివరించారు. కేసుల విచారణను వేగవంతం చేయాలని సెప్టెంబర్ 16న ఆదేశాలు ఇచ్చిన జస్టిస్ రమణ తదుపరి కేసులో భాగంగా అక్టోబర్ 6న ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నదని అదే రోజు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ లేఖ రాసిన విషయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి గమనించాలని జస్టిస్ అలి పేర్కొన్నారు.
ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకోవాలని కోరుతున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పరోక్షంగా న్యాయస్థానాలపై ప్రభావం చూపించాలని అనుకుంటున్నారని, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాసిన లేఖపై ఎలాంటి చర్యలు తీసుకున్నా అది వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరుకున్న విషయాన్నే చేసినట్లు ఉంటుందని అందువల్ల వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాసిన లేఖను ప్రధాన న్యాయమూర్తి అసలు పరిగణనలోకే తీసుకోరాదని జస్టిస్ అలి కోరారు.