కోవిడ్ 19 నివారణ తదితర అంశాలపై ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రాజంపేట పట్టణంలోని మునిసిపల్ ఆఫీస్ లో శనివారం నాడు జరిగిన రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి నియోజకవర్గాల స్థాయి సమీక్షా సమావేశంలో కోవిడ్ తో బాటు గాలివాన వల్ల పంట నష్టం పై కూడా చర్చించారు.
ఈ సమావేశానికి రాజంపేట శాసన సభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యుడు మేడా వెంకట మల్లి కార్జున రెడ్డి అధ్యక్షత వహించగా ఎంపీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ విప్ గండికోట శ్రీకాంత్ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకెపాటి అమర్నాధ్ రెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో కోవిడ్ 19 నివారణ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలను అప్రమత్తం చేయవలసిన విషయాలపై చర్చించారు. అదేవిధంగా గాలి,వాన దెబ్బకి దెబ్బతిన్న ఉద్యాన పంటలకు నష్టపరిహారం చెల్లింపు, పంటను మార్కెట్ కు తరలింపు, అనుమతి వివిధ అంశాల పై సంబంధిత అధికారులు వివరించారు.
కాగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఎవరిని కలవకుండా ఇంట్లో ఉన్న వారికి కూడా కరోనా లక్షణాలు వచ్చినట్టు ప్రకటించారని, ర్యాపిడ్ టెస్ట్ కిట్ ల ద్వారా పలుమార్లు టెస్ట్ లు చేసుకొని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
రాయచోటి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ కొనసాగించాలన్నదే తన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు.