సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన నలుగురు స్నేహితుల విహారయాత్ర విషాదంగా ముగిసింది. తిరుగు ప్రయాణంలో వారు రోడ్డు పక్కన నిల్చున్న సమయంలో ఓ డీసీఎం వ్యాను వారి మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు, బాధితుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా చింతలపాలెంకు చెందిన మతిన్, నాగుల్మీరా, కిరణ్, రామకృష్ణ స్నేహితులు. అందరూ డ్రైవింగ్ వృత్తిలో ఉన్నారు. ఈ నెల 9న వారు బొలెరో వాహనంలో కోనసీమ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లారు. రాజమండ్రి, యానాం తదితర ప్రాంతాలను సందర్శించి స్వగ్రామానికి బయలుదేరారు.
మార్గమధ్యలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఎన్టీఆర్ జిల్లా వీరవల్లి వద్ద వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపారు. నలుగురిలో రామకృష్ణ మూత్రవిసర్జన కోసం వెళ్లగా, మిగతా ముగ్గురు రోడ్డుపక్కన వాహనం వద్ద నిలబడ్డారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన డీసీఎం వ్యాన్ ముగ్గురిని బలంగా ఢీకొట్టటంతో మతిన్(25) అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆసుపత్రికి తరలిస్తుండగా నాగుల్మీరా(24) చనిపోయాడు. కిరణ్ను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మతిన్కు ఏడాది కిందటే వివాహమైంది. మూడు నెలల పాప ఉంది.