సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువు స్టేజి వద్ద 65 వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న కారును అతివేగంగా వస్తున్న మరో కారు ఢీకొన్నది. కారు వెనకాల నిలుచున్న ముగ్గురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదంలో గాయపడిన 5 ఏళ్ల బాబు పరిస్థితి విషమంగా ఉండటంతో 108 అంబులెన్స్ లో హుటాహుటిన కోదాడ ఆసుపత్రికి తరలించారు. మృతులు కృష్ణా జిల్లా కృతివెన్ను మండలం ఇంటేరు గ్రామానికి చెందిన వడుగు ఉమా మహేశ్వరరావు, మాముల్లమ్మ,దుర్గా గా పోలీసులు గుర్తించారు.
కోవిడ్ 19 ఎఫెక్ట్ వలన ఎవరూ సహాయం చేయడానికి రాకపోవడంతో మునగాల ఎస్సై సత్యనారాయణ గౌడ్ స్వయంగా మృత దేహాలను వాహనంలోకి ఎక్కించారు. కోదాడ డిఎస్పీ ఏ.రఘు, మునగాల సిఐ శివశంకర్ గౌడ్, ఎస్సై సత్యనారాయణ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.