40.2 C
Hyderabad
May 2, 2024 15: 30 PM
Slider ప్రత్యేకం

వాలంటీర్ల వ్యవస్థతో గ్రామ స్వరాజ్యం అంతం

#raghuramakrishnamrajuPM

రాష్ట్రంలో ఏ వ్యవస్థలోనూ ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నారని తీవ్రంగా ఆక్షేపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు తన ఎనిమిదో లేఖాస్త్రాన్ని సంధించారు. ప్రభుత్వానికి తన బాధ్యతలను గుర్తు చేస్తూ వరుస లేఖలు రాసి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూనే మంచి సలహాలను ఆయన అందిస్తున్నారు.

స్థానిక సంస్థలకు హక్కులు ఇవ్వడం మాట అటుంచి దానికి సమాంతరంగా వాలంటీర్ల వ్యవస్థ ను రూపొందించిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలను రఘురామకృష్ణంరాజు తన లేఖలో ఎత్తి చూపారు. చక్కటి పరిష్కారం కూడా చూపించారు. ఆయన ముఖ్యమంత్రి జగన్ కు రాసిన లేఖ పూర్తి పాఠం:

ముఖ్యమంత్రి గారూ,

మహాత్మా గాంధీ ఏమన్నారో మీకు ఒక్క సారి గుర్తు చేస్తాను….

పంచాయితీ రాజ్ వ్యవస్థ  ఏర్పాటు అయిన తర్వాత ప్రజాభిప్రాయం ఎంత శక్తివంతంగా మారుతుంది అంటే ఎంతో బలాన్ని ప్రయోగించి కూడా సాధించలేని పనులను ఆ వ్యవస్థ సునాయాసంగా సాధిస్తుంది. ప్రజల అభిప్రాయం దేవుడి ఆజ్ఞతో సమానమైనది. అంటే పంచాయితీ రాజ్ చెప్పే మాట దేవుడి ఆజ్ఞతో సమానమైనదన్నమాట.

పంచాయితీ రాజ్ అనేది స్థానిక స్వపరిపాలనలో అతిపురాతనమైనది. పంచాయత్ అనేది రెండు పదాల సమ్మిళితం. పంచ అంటే ఐదు అని అర్ధం. ఆయత్ అంటే ఒక చోట చేరడం అని అర్ధం. రాజ్ అంటే రాజ్యం చేయడం, పరిపాలన చేయడం అన్నమాట.

దేశంలో 2.5 లక్ష ల పంచాయత్ లు ఏదో ఒక పేరుతో కొనసాగుతూ పునాతన ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు కొనసాగింపుగా ఉన్నాయి. ఈ వ్యవస్థ మన ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థకు స్ఫూర్తి. అందుకే మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం నినాదాన్ని తీసుకువచ్చారు. అంటే కొన్ని రకాల నిర్ణయాధికారాలను పంచాయితీలకు దఖలు పరచాలని ఆయన చెప్పిన విషయం  ఆంధ్రప్రదేశ్ కు కూడా వర్తిస్తుంది. అయితే మన ప్రభుత్వ హయాంలో గ్రామ సభ అనేది కేవలం ఒక లాంఛనంగా తప్ప క్రియాశీలత్వం కోల్పోయి ఉన్నది.

సర్పంచ్ లకు చెక్ పవర్ ను ఇవ్వడంపై ప్రభుత్వంలో నెలకొని ఉన్న అస్పష్టత తీవ్రమైన అలజడికి కారణం అవుతున్నది. బ్యాంకుల నుంచి అవసరమైన నిధులను తీసుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లో సర్పంచ్ లు నిస్సహాయంగా ఉండిపోతున్నారు. ఈ కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ఉన్నాయి. సర్పంచ్ కు ఉప సర్పంచ్ కు కలిపి జాయింట్ చెక్ పవర్ ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నది. అయితే సర్పంచ్ కు పంచాయితీ కార్యదర్శికి కలిపి జాయింట్ చెక్ పవర్ ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

పంచాయితీ రాజ్ చట్టంలోని పలు సెక్షన్ లను ఉటంకిస్తూ అధికారులు చెబుతున్నఈ వాదనలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా ఉండటంతో మొత్తం వ్యవస్థలో గందరగోళం నెలకొని ఉన్నది. ఆర్ధిక సంఘం నిధులను పంచాయితీ కార్యదర్శి సహ సంతకందారుడిగా మాత్రమే విత్ డ్రా చేసుకోగలుగుతారని పంచాయితీరాజ్ చట్టంలో ఉన్నట్లుగా అధికారులు పదే పదే చెబుతున్నారు. గ్రామ పంచాయితీ ఎకౌంట్ల నుంచి సర్పంచ్ లు నిధులు డ్రా చేసుకోవడానికి నిర్దేశించిన లాంఛనాలను ఇప్పటి వరకూ ప్రభుత్వం పూర్తి చేయకపోవడం వల్లే ఈ అగమ్యగోచరమైన పరిస్థితి దాపురించింది. ఈ ఆందోళన, అనిశ్చితి మధ్య గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోతున్నది.

తమకు ఉప సర్పంచ్ లకు కలిపి చెక్ పవర్ ఇవ్వడాన్ని కొందరు సర్పంచ్ లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలా చేయడం వల్ల గ్రామాలో వర్గ వైషమ్యాలు పెచ్చరిల్లుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. వారంతా కూడా ఉప సర్పంచ్ తో తమకు జాయింట్ చెక్ పవర్ ఉండవద్దని, తక్షణమే రద్దు చేయాలని కోరుతున్నారు.

తమకు పాత పద్ధతి ప్రకారం పంచాయితీ కార్యదర్శితో కలిపి ఉమ్మడి చెక్ పవర్ ఉండాలని కోరుతున్నారు. ఇలాంటి వైరుధ్య భావనలను రెచ్చగొట్టడం ద్వారా గ్రామ పంచాయితీలను, మన ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే బలహీన పరుస్తున్నదని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఇదే అనిశ్చితిని కొనసాగిస్తే గ్రామ స్థాయిలో మన బలం పూర్తిగా క్షీణించే పరిస్థితి తలెత్తుతుంది.

నూతన పంచాయితీ రాజ్ చట్టం (73వ రాజ్యాంగ సవరణ) 1993 ఏప్రిల్ 24 నుంచి అమలులోకి వచ్చిన తర్వాత పంచాయితీలకు బాధ్యతలు అప్పగించడం ద్వారా స్వయం పాలనకు మార్గం సుగమం చేయాలని నిర్దేశించారు. అయితే ఈ ఏడాది మార్చి 25న మన ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం 2 ఈ విధానానికి విఘాతం కలిగించేదిగా ఉంది. 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి పూర్తిగా భిన్నంగా ఉంది.

మీరు జారీ చేసిన జీవో ప్రకారం పంచాయితీ స్టాఫ్, వాలంటీర్లు, గ్రామ కార్యదర్శులు సర్పంచ్ లకు జవాబుదారిగా ఉండాల్సిన అవసరం లేదు. ఇదే సమయంలో వారికి చెక్ పవర్ కూడా ఇప్పటి వరకూ ఇవ్వలేదు. ఈ విధంగా పంచాయితీరాజ్ వ్యవస్థకు సమాంతరంగా మరొక వ్యవస్థను సృష్టించినట్లు అయింది. ఇలా దేశంలో ఎక్కడా లేదు…. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో తప్ప.

అదే విధంగా మీరు ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసి వాలంటీర్లను నియమించారు.  వాలంటీర్లు కనీస వేతనాల చట్టం 1948 పరిధిలోకి రాకుండా మీరు జాగ్రత్తలు తీసుకుని వారికి పారితోషికం పేరుతో వేతనం అందిస్తున్నారు. ఇవన్నీ ప్రజలు ఇప్పటికే అర్ధం చేసుకున్నారు. మీ ఆలోచనలతో చాలా మంది పూర్తిగా విభేదిస్తున్నారు కాబట్టి మీరు ఎంతగా వివరించినా ఇక ఇప్పుడు లాభం లేదు.

ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ఎన్నకున్న ప్రజాప్రతినిధులకు ప్రత్యామ్నాయంగా వాలంటీర్లను నియమించడం ప్రజాభిప్రాయాన్ని కాలరాయడమే అవుతుంది. ఇలాంటి ప్రజాభిప్రాయ వ్యతిరేక చర్యలను గ్రామ స్థాయిలోని ప్రజలు ఏ మాత్రం హర్షించరు సరికదా పూర్తిగా వ్యతిరేకిస్తారు. ఇలా చేయడం అన్యాయమని క్షేత్ర స్థాయిలో ఎంతో మంది ప్రజాప్రతినిధులతో బాటు ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వారు అందరూ గగ్గోలు పెడుతున్నారు.

పంచాయితీ రాజ్ వ్యవస్థను నీరుగార్చేవిధంగా మన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో క్షేత్ర స్థాయిలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోతున్నది. ఇలాంటి చర్యలను చాలా మంది ఎమ్మెల్యేలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇలా ఎమ్మెల్యేలు వ్యతిరేకించడం ఇప్పుడు పైకి కనిపించడం లేదు కానీ త్వరలోనే వెల్లడి కావడం ఖాయంగా కనిపిస్తున్నది.

తక్షణమే బేషరతుగా జీవోను ఉపసంహరించుకోవాలని, సర్పంచ్ లకు, గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వారికి రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం బాధ్యతలు అప్పగించాలని, తద్వారా క్షేత్ర స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని నేను డిమాండ్ చేస్తున్నాను.

భవదీయుడు

కె.రఘురామకృష్ణంరాజు

Related posts

జగన్నాథ్ రథ చక్రాలు వచ్చాయి…తరించండి…!

Bhavani

ప్రేమ పూజారినయ్యా..

Satyam NEWS

ఎన్నికల శిక్షణ పకడ్బందీగా చేపట్టాలి

Bhavani

Leave a Comment