యర్రగొండపాలెం ఘటనకు ముఖ్యమంత్రే కారణం: చొక్కా విప్పి నిరసన తెలిపిన మంత్రిని డిస్మిస్ చేయాలి
టైమ్స్ నౌ తన సర్వే లో రాష్ట్రం లోని 25 ఎంపీ స్థానాలకుగాను తమ పార్టీ 26 స్థానాలలో గెలుస్తుందని చెబితే బాగోదని, 25 కు 25 స్థానాలలో గెలుస్తుందని చెప్పినట్టు ఉంది. 25 కు 25 స్థానాలలో గెలిచే అవకాశమే ఉంటే, ప్రధాన ప్రతిపక్ష నేత పాల్గొనే సభను అడ్డుకునేందుకు బట్టలిప్పుకొని నిరసనలు తెలియజేయడం ఎందుకని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.
ఇమేజ్ బిల్డప్ కోసం టైమ్స్ నౌ కు 8.5 కోట్ల ప్యాకేజీ ఇచ్చిన మాట నిజం కాదా? అని నిలదీశారు. తననెమో తన ఊరుకు రానివ్వరు… ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని ఏ ఊరు తిరగనివ్వరు. యర్రగొండపాలెం లో చంద్రబాబు నాయుడు పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేసిన దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు రఘురామకృష్ణం రాజు తెలియజేశారు. ప్రజాస్వామ్య వాదులంతా ఈ దాడిని ఖండించాలని కోరారు.
ప్రజాస్వామ్యంలో చీకటి రోజు
ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజన్న ఆయన, రాష్ట్రంలో గత నాలుగేళ్లు అనుదినము చీకటి దినమేనని పేర్కొ న్నారు . శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా లో రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వమని, ఇప్పటికే ప్రతిపక్ష నేతలు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బ్రహ్మ, విష్ణువు , మహేశ్వరులు మాదిరి గా కలుస్తారా?, విష్ణువు, మహేశ్వరులు మాత్రమే కలుస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. బ్రహ్మ నేరుగా రాకుండా, మహేశ్వరుని ద్వారా కలిసి వచ్చే అవకాశం ఉంది. విష్ణుమూర్తి టిడిపి అనుకుంటే, మహేశ్వరుడు జనసేన అని భావిస్తే, ఇక బ్రహ్మ బిజెపి అని ఆయన పేర్కొన్నారు. తన అంచనా ప్రకారం అయితే, త్రిమూర్తులు కలుస్తారని చెప్పారు.
దళితులకు ఎంతో మేలు చేసిన చంద్రబాబు
దళితుల అభ్యున్నతికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. గత రెండు రోజులుగా చంద్రబాబు నాయుడు పర్యటనకు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తుండడంతో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీవ్ర ఆందోళన చెందుతుంది. ఎలాగైనా ఆయన సభలను అడ్డుకోవాలని ఉద్దేశంతో, రాళ్ల దాడికి తెగబడ్డారు.
చంద్రబాబు నాయుడు సభను అడ్డుకునేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ తాను చొక్కా విప్పడమే కాకుండా, ఇతరులతో కూడా చొక్కా విప్పించి చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ, నిరసన తెలియజేయడం హస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు నాయుడు దళితులకు ఎందుకు క్షమాపణలు చెప్పాలి. దళితుల అభ్యున్నతికి కృషి చేసినందుకా?. తాను అధికారంలో ఉండగా దళితుల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినందుకా? ఎందుకు చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలో తెలియజేయాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు.
చంద్రబాబు నాయుడు సభ పై దాడి చేయడమే కాకుండా, చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టారని, అయినా అధికార పార్టీ క్యాడర్ సమయమనం పాటించిందని సాక్షి దినపత్రికలో రాయడం విడ్డూరంగా ఉంది. ప్రజలను ఏమైనా సాక్షి దినపత్రిక యాజమాన్యం పిచ్చివారని అనుకుంటున్నాదా ?, ప్రజలే అధికార పార్టీ నాయకులను పిచ్చి వారిని అనుకుంటున్నారు.
మంత్రి ఆదిమూలపు సురేష్ చొక్కా ను ఏమైనా తెలుగుదేశం పార్టీ వారు విప్పించారా?, ప్రకాశం జిల్లాలో ఎంతోమంది ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఉన్నప్పటికీ, దళిత నాయకుడిని ముందు పెట్టి దాడి చేయించడమే కాక, చంద్రబాబు నాయుడుని దళిత ద్రోహిగా చిత్రీకరించేందుకు తెర వెనుక నుంచి ముఖ్యమంత్రి రాజకీయం చేశారన్నారు.
గన్నవరం సీఐలా నాటకం కాదు… నిజమైన గాయం
చంద్రబాబు నాయుడుపై రాళ్ల దాడి చేయగా, ఎన్ ఎస్ జి కమాండెంట్ సంతోష్ కుమార్ కు తలకు గాయమయ్యింది. మూడు కుట్లు కూడా పడ్డాయి. గన్నవరం సీఐ కి మాదిరి కాదు. నిజంగానే కుట్లు పడినప్పటికీ, వెంటనే విధుల్లో చేరి, చంద్రబాబుకు రక్షణగా నిలబడ్డారు. జెడ్ ప్లస్ కేటగిరి రక్షణ కలిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మీటింగులలో పాల్గొనకుండా అడ్డుకోవడం దారుణం. ఇదా మన పరిపాలన. ఈ సంఘటనకు ముఖ్యమంత్రి దే బాధ్యత. ముఖ్యమంత్రిది బాధ్యత కాక పోతే, చొక్కా విప్పి నిరసన తెలియజేసిన మంత్రిని బాధ్యున్ని చేస్తూ, వెంటనే మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేయాలి.
ఈ సంఘటనపై రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకొని జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉన్నదా, లేదా అన్నది విచారణ జరిపించాలి. ఈ ఘటనలో ముఖ్యమంత్రి పాత్ర ఉంటే, ఆయన తన పదవిలో కొనసాగడానికి అనర్హుడు. లేనిపక్షంలో, మంత్రి సురేష్ తన పదవిలో కొనసాగడానికి నైతిక అర్హత లేదు. రాజకీయాలలో ఇప్పటివరకు చొక్కా విప్పి నిరసన తెలియజేసిన మంత్రిని తాను చూడలేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
ఈ ఘటనకు కారణమైన జగన్మోహన్ రెడ్డిని అభినందించాలని అపహాస్యం చేశారు. ప్రస్తుతం చొక్కా విప్పించారని, రేపు ఇంకా ఏమి విప్పిస్తారోనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు పై జరిగిన దాడి ఘటనను తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తాను సుదీర్ఘమైన లేఖ రాసినట్లు రఘురామకృష్ణం రాజు మీడియా సమావేశంలో లేఖ ప్రతిని ప్రదర్శించారు. దాడి ఘటనపై, డీజీపీ, రాష్ట్ర ఇంటలిజెన్స్ ఐజి కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇచ్చే అవకాశం ఉంది. అయినా కేంద్రానికి ఇంటలిజెన్స్ బ్యూరో ( ఐబీ )ఉంటుందని, ఐబీ ద్వారా నివేదికలు తెప్పించుకుంటారన్నారు.
దగుల్బాజీ సంస్థగా మారిన సిఐడి
ప్రశ్నించిన వారందరికీ నోటీసులు జారీ చేస్తూ సిఐడి దగుల్బాజీ సంస్థ గా మారిందని రఘురామకృష్ణంరాజు ఫైర్ అయ్యారు. ఇటీవల న్యాయవాదులు ప్రశ్నించగా , వారికి నోటీసులు జారీ చేశారు. ఇదే విషయాన్ని న్యాయవాదుల బృందం, ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలన గురించి తాను లేఖ ద్వారా ప్రధాన మంత్రికి నివేదించడంతోపాటు, హోంమంత్రికి కూడా తెలియజేయడం జరిగింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జరిపిన రాళ్ల దాడి లో ఎన్ ఎస్ జి కమాండోకు తగిలిన రాయి, చంద్రబాబు నాయుడు తల కణతకు తగిలి ఉంటే, ఆయన చనిపోయి ఉండేవారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రావణ, నరకాసుర, హిరణ్య కష్యుడి పాలనలో జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కలిగిన ప్రధాన ప్రతిపక్ష నేత, రక్షణకే దిక్కు లేకుండా పోతుంది. ఈ రాక్షస, దుర్మార్గపు పోలీస్, సిఐడి పాలన నుంచి రాష్ట్ర ప్రజలను గవర్నర్ కాపాడాలి.
గతంలో కసాయిలాగా వ్యవహరించే సాయి, సినీ హీరో నాగార్జున ప్రచారం చేస్తున్నా సంస్కారవంతమైన ట్రిపుల్ ఎక్స్ సోప్ ను ఉపయోగించినట్లుగా ఈ దరిద్రపు సంస్కృతి నుంచి బయట పడుతున్నాడు. అలాగే ఈ దుష్ట సమూహము నుంచి తనలాగే బయటపడితే మంచిదని సూచించారు. దుష్టులకు ఉన్నత విద్యావంతుడైన విజయసాయిరెడ్డి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నారు.