విజయ నగరంలోని స్విమ్మింగ్ ప్రియులకు శుభవార్త… కంటోన్మెంట్ ప్రాంతంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గతంలో నిర్మించిన స్విమ్మింగ్పూల్ ఆధునిక వసతులతో తాజాగా మళ్లీ స్విమ్మర్లకు ఆహ్వానం పలుకుతోంది. మరమ్మత్తులు, ఆధునీకరణ పనుల కోసం ఈ స్విమ్మింగ్ పూల్ గత కొంతకాలంగా మూసివేశారు. దీని నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించిన తర్వాత ఆ సంస్థ 28 లక్షలతో దీనిని ఆధునీకరించి మరిన్ని వసతులతో సిద్ధంచేసింది. వేసవిలో స్విమ్మింగ్ నేర్చుకునేందుకు ఆసక్తి కనబరిచే బాలబాలికలు ఇతరులకు, సాధన చేసేవారికి ఈతకొలను అందుబాటులోకి రావడంతో ఇది ఎంతో ఉపయోగపడనుంది. రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి ఆధునీకరించిన స్విమ్మింగ్ పూల్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల మాట్లాడుతూ నగరంలో క్రీడాకారులను ప్రోత్సహించి, వారికి అవసరమైన వసతులు కల్పించేందుకు సిద్ధంగా వున్నామని చెప్పారు. అన్ని రంగాలతో పాటు క్రీడారంగాన్ని కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం జగన్ వున్నారని, అందులో భాగంగానే అక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ సహాయ సహకారాలతో నగరంలోని అన్ని స్టేడియంలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లలో వసతుల కల్పనకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాజీవ్ స్టేడియంలో రాత్రివేళల్లో నడకకు వీలుగా లైట్లు ఏర్పాటు చేయించామని, రానున్న రోజుల్లో క్రీడాకారులకు ఎలాంటి వసతులు కావాలన్నా కల్పించేందుకు సిద్ధంగా వున్నామని చెప్పారు. ఇక్కడి స్విమ్మింగ్ పూల్ లో శిక్షణ పొందిన బాలబాలికలు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఎంతగానో రాణించారని డిప్యూటీ స్పీకర్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఎందరో స్విమ్మర్లను తీర్చిదిద్దేందుకు ఈ అక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ దోహదపడగలదని ఆకాంక్షను వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో సెట్విజ్ సి.ఇ.ఓ. రాంగోపాల్, వి.ఎస్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.