ప్రధానమంత్రి మోడీ పర్యటన సందర్భంగా ఆంధ్ర, తెలంగాణ ఇంటలిజెన్స్ పోలీసులు కలిసి అల్లర్లు ఎక్కడ జరుగుతాయో అక్కడ తమ సిబ్బందిని మోహరించినట్లు కట్టు కథలు చెబుతున్నాయని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. దానిలో భాగంగానే తన ఇంటి వద్ద ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ పహారా కాసినట్లు కట్టు కథలు చెబుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటలిజెన్స్ పోలీసులు తన ఇంటి చుట్టూ తిరగవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మరి తెలంగాణ ఇంటలిజెన్స్ పోలీసులు భీమవరం సభలో ఘర్షణలు తలెత్తకుండా మహారా కాశారా? అంటూ ప్రశ్నించారు. తన ఇంటి వద్ద దొంగలా తచ్చాడుతున్న వ్యక్తిని సి ఆర్ పి ఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో అప్పగించారని, ఐడి కార్డ్ ఎక్కడ అని ప్రశ్నించగా తన వద్ద ఐడి కార్డు లేదంటూ మీడియా ముందు ఆ వ్యక్తి వాంగ్మూలం ఇచ్చారని గుర్తు చేశారు.
అయితే సాక్షి దినపత్రికలో మాత్రం ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ పై రఘురామరాజు కుటుంబం దాడి అంటూ వార్తా కథనం ప్రచురించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తీరు పై మండిపడ్డారు. స్టీఫెన్ రవీంద్ర వ్యవహార శైలిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాస్తానని చెప్పారు. స్టీఫెన్ రవీంద్ర గతంలో కడపలో పనిచేశారని… ఆయన, జగన్మోహన్ రెడ్డి మనిషని వ్యాఖ్యానించారు. స్టీఫెన్ రవీంద్రను ఆంధ్రకు తెచ్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారని కానీ కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో ఆ ప్రయత్నాలు విరమించుకున్నారని చెప్పారు.