మాజీ సీఎం చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి లోకేష్ విదేశీ ప్రయాణాలపై ఈనెల 25 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ విచారణ జరపబోతున్నది. చంద్రబాబు, లోకేష్ లు అధికారంలో ఉన్నప్పుడు చేసిన విదేశీ ప్రయాణాలు, రాష్ట్రానికి తీసుకువచ్చిన విదేశీ పెట్టుబడులు తదితర అంశాలపై ప్రకాశం జిల్లా విజిల్ బ్లోయర్ యన్.నాగార్జున రెడ్డి 2018 ఫిబ్రవరిలో సమాచార హక్కు చట్టం -2005 ప్రకారం సమాచారం కోరారు.
నాగార్జున రెడ్డి చేసిన దరఖాస్తును అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరిస్తూ సమాచారం ఇవ్వటానికి నిరాకరించింది. ఆ విషయంపై నాగార్జున రెడ్డి తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి అప్పీలు దాఖలు చేయగా, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మినిస్టర్ లోకేష్, అప్పటి చీరాల టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ లు కుట్రపూరితంగా వ్యవహరించి అప్పటి చీరాల DSP ప్రేమ కాజల్ తో ఆయనపై అక్రమ కేసు నమోదు చేయించారు.
ఆ తర్వాత అరెస్టు చేసి నాగార్జున రెడ్డిని జైలుకు పంపించారు. అప్పటికే రోడ్డు ప్రమాదంలో కుడి చేతికి తీవ్ర గాయాలు అయి, కాలర్ బోన్ విరిగి వైద్యం పొందుతున్న పరిస్థితులలో కూడా చంద్రబాబు ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఆయనను జైలుకు పంపింది. 20 రోజుల తర్వాత బెయిల్ పై విడుదలైన నాగార్జున రెడ్డి తను కోరిన సమాచారం ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ కు రెండవ అప్పీలు దాఖలు చేశారు.
2018లో దాఖలు చేసిన రెండవ అప్పీలు ఈనెల 25వ తేదీన విచారణకు రానున్నది. నాగార్జున రెడ్డి కి ఇప్పటికైనా చంద్రబాబు విదేశీ ప్రయాణాల తాలూకు సమాచారం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా లేదా అన్నది రాష్ట్ర సమాచార కమిషన్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. అయితే తాను కోరిన సమాచారం చట్ట ప్రకారం తనకు ఇవ్వాలని, అలా ఇచ్చే వరకూ తాను చట్ట ప్రకారం పోరాడుతూనే ఉంటానని నాగార్జున రెడ్డి ‘సత్యం న్యూస్’ కు తెలిపారు.
సమాచార హక్కు చట్టం ప్రకారం తాను కోరిన సమాచారం పొందడం రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా అవసరమని తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిగా, సంబంధిత మంత్రిగా విదేశీ ప్రయాణాలకు వారు చేసిన ఖర్చు ప్రజాధనం అయినందున వివరాలు కోరడం విజిల్ బ్లోయర్ గా తన కర్తవ్యమని నాగార్జున రెడ్డి అన్నారు.