బాలికల సాధికారత కోసం సేవా భారతి అధ్వర్యంలో రన్ ఫర్ గర్ల్ చైల్డ్ ఉత్సాహంగా సాగింది. సేవా భారతి-తెలంగాణ అధ్వర్యంలో బాలికల సాధికారత కోసం కృషి చేస్తున్న “కిషోరి వికాస్” కార్యక్రమం గురించి అవగాహన కల్పించడానికి “రన్ ఫర్ గర్ల్ చైల్డ్” 21/10/5 కె రన్ నాలుగవ ఎడిషన్ గచ్చిబౌలి లో ఆదివారం ఉత్సాహంగా జరిగింది.
ఈ రన్ ను గాచిబౌలి స్టేడియంలో జస్టిస్ కోదండరామ్, డి.జి.పి, చైర్మన్ రోడ్ సేఫ్టీ అథారిటీ కృష్ణ ప్రసాద్ తో పాటు ఇతర ప్రముఖులు, మల్టీ నేషనల్ సంస్థల కార్పొరేట్ అధిపతులు జండా ఊపి ప్రారంబించారు. జస్టిస్ కోదండ రామ్ కూడా 5 కె రన్ లో పాలు పంచుకున్నారు. 5, 10 , 21 కిలోమీటర్ల, మూడు విభాగాల్లో కొనసాగిన ఈ రన్ లో కార్పొరేట్లు, వారి కుటుంబాలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, స్వచ్చంద సంస్థలు, విద్యార్థులు కలిసి మొత్తం 7000 మంది పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది కిషోరి వికాస్ లబ్ధిదారులు పాల్గొని వివిధ సాంస్కృతిక, ఆత్మరక్షణ నైపుణ్యాలను ప్రదర్శించారు. అనంతరం మూడు విభాగాలో విజేతలు గా నిలిచిన వారికీ అర్జున్ అవార్డు గ్రహీత, చెస్ గ్రాండ్ మాస్టర్ హారిక ద్రోణవల్లి, సేవ భారతి ప్రెసిడెంట్ దుర్గా రెడ్డి, కిషోరీ వికాస్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జయ ప్రద, ప్రెసిడెంట్ కిరణ్మయి బహుమతిలను అందజేశారు.
ప్రస్తుతం 210 కిషోరి వికాస్ కేంద్రాలు హైదరాబాద్ మురికివాడల్లో 5348 మంది లబ్ధిదారులతో చురుకుగా పనిచేస్తున్నాయి. ఈ పరుగు ద్వారా దీనిని 400 కిషోరి కేంద్రాలకు, 10,000 మంది లబ్ధిదారులకు పెంచడమే లక్ష్యం. ఈ కేంద్రాలు మురికివాడలు, తక్కువ ఆదాయ ప్రాంతాలలో నివసించే బాలికలను వారి విద్య, ఆరోగ్యం, నైపుణ్య అభివృద్ధికి తోడ్పడుతున్నాయని సేవా భారతి, ప్రధాన కార్యదర్శి రామ మూర్తి ప్రభల అన్నారు. ఫ్రీడమ్ ఆయిల్, గ్లోబల్డేటా, అవినియాన్, జిజికె టెక్, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్, ఎన్ఎండిసి, కాప్జెమిని, మంజీరా కన్స్ట్రక్షన్స్, జిఇపి, జెన్పాక్ట్ ఇతర ఐటి కంపెనీలు పాలు పంచుకోగా, EZE సాఫ్ట్వేర్, MAHA సిమెంట్స్, క్వాంటియం, వెస్ట్ ఫార్మా, హార్స్కో, GATI, జెన్ టెక్నోల్జీస్, ల్యాండ్మార్క్ హాస్పిటల్స్, స్టార్మా, లైకోస్ ఈ రన్ కు తమ వంతు బాధ్యత గా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిల్టీ భాగస్వామ్యం అందించాయి.