ఉపరితలం నుంచి గగన తలంలోని లక్ష్యాలను ఛేదించే ఎస్–400 క్షిపణుల సరఫరా ప్రక్రియను రష్యా ప్రారంభించింది. అనుకున్న ప్రకారమే భారత్కు ఎస్–400 క్షిపణుల్ని సరఫరా చేసే ప్రక్రియ ప్రారంభమైందని రష్యా వెల్లడించింది. సుదూర లక్ష్యాలను ఛేదించడంలో, గగనతలం నుంచి వచ్చే ముప్పుని ఎదుర్కోవడంలో ఎస్–400 క్షిపణులు మన దేశానికి అండగా నిలవనున్నాయి.
మొదటి క్షిపణిని చైనాతో సంక్షోభం నెలకొని ఉన్న లద్దాఖ్ సెక్టార్లో మెహరించాలని భారత వాయుసేన భావించినట్టు తెలుస్తోంది. మరోవైపు చైనా, పాకిస్తాన్ల నుంచి ఏకకాలంలో వచ్చే ముప్పుని ఎదుర్కోవడానికి వీలుగా పశ్చిమ ప్రాంతంలో ఈ క్షిపణుల్ని మోహరించే ఉద్దేశంలో కేంద్రం ఉన్నట్టుగా రక్షణ శాఖలోని కొందరు అధికారులు చెబుతున్నారు.
2018లో రూ.35 వేల కోట్లతో 5 ఎస్–400 క్షిపణుల కొనుగోలుకు రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. సముద్రం, గగనతలం మీదుగా ఈ క్షిపణుల అందజేయనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 5 క్షిపణులు భారత్కు చేరనున్నాయి. ఇప్పటికే ఈ క్షిపణుల వినియోగంపై భారత వైమానిక దళం అధికారులకు శిక్షణ కూడా పూర్తయింది.