ఉక్రెయిన్ పై రష్యా దారుణ దాడిపై తొలి సారి భారత్ తీవ్ర అందోళన వ్యక్తం చేసింది. సోమవారం ఉక్రెయిన్లోని పలు నగరాలపై రష్యా సైన్యం దాడి చేసింది. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోవడం, గాయపడినట్లు సమాచారం అందడంతో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఒక ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్లో మౌలిక సదుపాయాలు, పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు పెరగడం పట్ల భారతదేశం తీవ్ర ఆందోళన చెందుతోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. శత్రుత్వాన్ని పెంచుకోవడం ఎవరికీ ప్రయోజనం కాదని భారత్ పునరుద్ఘాటించింది. యుద్ధం ముగింపు కోసం దౌత్యం మరియు చర్చలను ప్రారంభించాలని భారత్ పిలుపునిచ్చింది.
ఉద్రిక్తతలను తగ్గించే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తుంది. సంఘర్షణ ప్రారంభం నుండి ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టం మరియు అన్ని దేశాల సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రత సూత్రాలపై ఆధారపడిన భారతదేశం తన వైఖరికి కట్టుబడి ఉందని ప్రకటనలో పేర్కొన్నారు. ఉక్రెయిన్ రాజధాని కైవ్తో సహా అనేక నగరాలపై నెలల గా రష్యా దాడి చేస్తున్నది.
రష్యా సైన్యం కైవ్ మరియు ఇతర నగరాలపై డెబ్బైకి పైగా క్షిపణులను ప్రయోగించింది. ఇంతకుముందు, క్రిమియాను రష్యాకు అనుసంధానించే వంతెనపై పేలుడు సంభవించింది. రష్యా దాడులకు సంబంధించిన కొన్ని చిత్రాలను ట్విట్టర్లో పంచుకుంటూ ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ ఇలా వ్రాశారు యుద్దభూమిలో మన ప్రజలను చంపిన ఉగ్రవాద దేశం యొక్క నిజమైన ముఖాన్ని ప్రపంచం మరోసారి చూసింది. శాంతి గురించి మాట్లాడటం ద్వారా తన నిజమైన రక్తపాత లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునే దేశం అది అని ఆయన అన్నారు.