రైతు వేదికలు పూర్తిగా రైతు సమస్యలను తీర్చగలుగుతాయా? అసంఘటిత రంగంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని సంఘటిత పరచకుండా సమస్య పూర్తిగా సమసిపోతుందా అని తెలుగు దేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన ప్రశ్నించారు.
మహిళా కూలీ – పురుష కూలీ మధ్య వేతన తారతమ్యాన్నీ తీసివేయకుండా, చిన్న చిన్న కమతాల మధ్య గట్ల రూపంలో సారవంతమైన భూమిని కోల్పోతుంటే అలాంటి సమస్యలను రైతు వేదికలు ఏ విధంగా పరిష్కరిస్తాయని ఆమె ప్రశ్నించారు.
ఆహార ధాన్యాల సప్లై డిమాండ్ ల మధ్య అసమతుల్యాన్ని పరిష్కరించకుండా, గిట్టుబాటు ధరలను నిర్ణయించకుండా, జాప్యం చేసి రైతు గుండెలు అలసిపోయి – ఆగి పోయిన తర్వాత ఆలోచిస్తే రైతు వేదిక పరిష్కారం చూపిస్తుందా అంటూ కాట్రగడ్డ ప్రసూన ప్రశ్నించారు.
ప్రకృతి వైపరీత్యాలపై ప్రభుత్వం స్పందించకుండా, రైతు వేదికలపైన సమస్య పరిష్కారం వేద్దామా? రవాణా సౌకర్యాలు పెంచకుండా, ఎగుమతుల ప్రోత్సాహము ఇవ్వకుండా, సాంద్రతని పెంచకుండా, మేలురకం విత్తనాలు ఇవ్వకుండా, దళారుల రాజ్యాన్ని రూపు మాపకుండా, వ్యవసాయ శీతలీకరణ (Cold Storage) గిడ్డంగులను పెంచకుండా రైతు వేదికలు పరిష్కారం చూపిస్తాయా? అంటూ ఆమె ప్రశ్నలు గుప్పించారు.
రైతు రాజ్యం రావాలంటే, రైతుల కళ్లలో ఆనంద బాష్పాలు ఉండాలంటే, వ్యవసాయం మీద ఆధారపడే ప్రచ్ఛన్న నిరుద్యోగులను (Disguised Unemployment) తగ్గించి, ఇతర రంగాల ఉద్యోగ అవకాశాలను పెంచాలి. రైతుల ఆత్మ గౌరవాన్ని గుర్తించి, విలువ కట్టలేని రైతు శ్రమ సౌందర్యానికి సమాజం లో గౌరవం కల్పించాలని ప్రసూన కోరారు.
అలా చేసినప్పుడే తెలంగాణ – బంగారు తెలంగాణ – కోటి రతనాల వీణ అవుతుందని ఆమె అన్నారు. రైతుల చేతులకి బేడీలు వేసే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు ఉన్న చోట రైతు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనడంలో సందేహం లేదని ప్రసూన అన్నారు.