సాధారణంగా రక్త దానం చేయడమే ఒక మహత్కార్యం. అందులోనూ కరోనా సమయంలో ప్రపంచ మొత్తం రక్తం కొరత ఏర్పడి ఉన్న ఈ రోజుల్లో నేనున్నాను అంటూ ముందుకు వచ్చి అవసరమైన గ్రూపు రక్తాన్ని దానం చేయడం అంటే అది అసామాన్యం. అలాంటి అద్భుతమైన పనిని చేశారు హుజూర్ నగర్ మునిసిపాలిటీలో పనిచేసే బిల్ కలెక్టర్ ఉద్యోగి నిమ్మల మల్లేష్ గౌడ్.
హుజూర్ నగర్ మండలం లక్కవరం గ్రామానికి చెందిన చిమట సైదులు అనారోగ్యంతో బాధపడుతూ ఒక ప్రయివేటు హాస్పటల్లో చేరాడు. అతనికి బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉందని డాక్టర్ ఆర్. సంతోష్ కుమార్ చెప్పడంతో డాక్టర్ సూచన మేరకు, పేషెంట్ తరపువారు దగ్గుపాటి సుశీల రాజారత్నం (డి ఎస్ ఆర్) ట్రస్ట్ ను కోరారు.
వారి పిలుపు అందుకున్న నిమ్మల మల్లేష్ గౌడ్ నేనున్నానంటూ ముందుకొచ్చి ఓ పాజిటివ్ బ్లడ్ దానం చేశాడు. మిర్యాలగూడెం లోని ఒక బ్లడ్ బ్యాంక్ ద్వారా పేషంట్ కు చేరింది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బాబూరావు మాట్లాడుతూ కరోనా కాలంలో రక్తం నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు.
కరోనా కారణంగా తగ్గిన రక్త నిల్వలు
కరోనా లాక్ డౌన్ కారణంగా రక్తదాతలు రావడం లేదని అందువల్ల అనారోగ్య బారిన పడిన పేద రోగులకు ఇబ్బంది కలుగుతున్నదని ఆయన తెలిపారు. అత్యవసర పరిస్థితిలో బ్లడ్ శాతం తక్కువుగా ఉండి ఇబ్బంది పడేవారికి తమ ట్రస్టు తరఫున ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఏ గ్రూపు బ్లడ్ కావాలని చెబితే వెంటనే స్పందించి వారికి అవసరమైన బ్లడ్ ని అందిస్తామని అన్నారు.
ఇదే క్రమంలో గర్భిణీ స్త్రీలకు, ప్రమాద బారిన పడిన పేషెంట్లకు, రక్తహీనత, డయాలసిస్ పేషెంట్ లకు రక్తం అందించాలంటే పట్టణంలో బ్లడ్ బ్యాంక్ లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లి బ్లడ్ ఇచ్చి మరల బ్లడ్ తీసుకొని వచ్చి ఎక్కించాలంటే సీరియస్ పేషెంట్లకు ఇబ్బందికరంగా మారుతుందని, కనుక మన పట్టణంలోనే(హుజూర్ నగర్) తక్షణమే పేదప్రజలను దృష్టిలో పెట్టుకొని బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని, మన దగ్గర ఉన్న వంద పడకల ఆసుపత్రికి బ్లడ్ బ్యాంక్ లేకపోవడం శోచనీయం అన్నారు.
రక్తదానం చేసిన మల్లేష్ కి ప్రత్యేకంగా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఆపదలో ఉన్న వారికి ప్రతి ఒక్కరు రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతలు కండి అని కోరారు. ఈ కార్యక్రమంలో మీసాల అంజయ్య, నాపసాని శివ, ములకలపల్లి రాంబాబు, కామళ్ళ మార్క్స్, గుండ్ల రాజేష్ హస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.