అధికారికి పనిమీద వస్తే ప్రభుత్వం దారి ఖర్చులు ఇస్తుంది కదా? ఏమో తెలీదు ఈ అధికారులు మాత్రం రెండు ఇసుక క్వారీల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు వచ్చి, ఇద్దరికి రాజీ కుదిర్చి దాబాలో చక్కగా భోజనం చేసి మరీ వెళ్లారు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం లోని కుర్లా గ్రామంలో ఇసుక క్వారీ హద్దుల విషయంలో అధికారులు క్లారిటీ ఇచ్చారు. మంజీర పరివాహక ప్రాంతంలో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలకు కొందరికి అనుమతులు జారీ అయ్యాయి.
అయితే వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు హద్దులు వరదల్లో కొట్టుకు పోవడం, పక్కనే బిచ్కుంద మండలానికి చెందిన కథగా౦ గ్రామంలో మరో ఇసుక క్వారీ అనుమతి ఉండటంతో సర్వే అధికారులు ఎవరికి కేటాయించినా ప్రాంతాలను వారే ఇసుకను తవ్వుకోవాలని సూచించారు.
ఈ మేరకు నేడు ఇసుక తవ్వకానికి హద్దులు ఏర్పాటు చేశారు. హద్దులో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఇసుక తోడెస్తే కఠిన చర్యలుంటాయని వారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సర్వే ఏడి శ్రీనివాస్, టీఎస్ఎండీసీ పివో రామకృష్ణ,రాయల్టీ ఇన్స్పెక్టర్ నాగరాజు, భూగర్భ జల శాఖ అధికారి రవికుమార్ ,రెవెన్యూ ఇన్స్పెక్టర్లు బీర్కూర్ శ్రీనివాస్, బిచ్కుంద సాయిబాబా, సర్వేయర్లు బిచ్కుంద గోపాల్,మద్నూర్ రమణ,బీర్కూర్ అనిల్, రెవెన్యూ సహాయకులు ఉన్నారు.
అధికారికంగా ఈ పని చేసిన వారు ఎవరి ఆఫీసులకు వారు వెళ్లిపోవాలి కదా? అలా చేయకుండా నేరుగా ఆ క్వారీ యజమానులతో కలిసి అధికారులు దాబాకు వెళ్లారు.
క్వారీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన విందు భోజనంలో అధికారులు పాల్గొనడం క్వారీ నిర్వాహకులు అధికారులు కుమ్మక్కై అక్రమాలకు తెర లేపి నట్లే అని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
గతంలో కూడా అధికారులను మచ్చిక చేసుకొని ఇసుక రీచ్ ల ద్వారా అక్రమ ఇసుక రవాణా జరిగిందని, అక్రమాలు జరగకుండా చూడాల్సిన అధికారులే నిర్వాహకులతో చేతులు కలిపి వారు ఇచ్చే విందులలో పాల్గొంటూ వారికి సహకరించడం పట్ల స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.