ప్రభుత్వం మారినా ఇసుక మాఫియా స్వరూపం మాత్రం మారడం లేదు. అదే మాఫియా వ్యక్తులు మారారు తప్ప అదే విధంగా కొనసాగుతుండటం నిజమైన విషాదం. సామాన్యులకు ఇసుక సరసమైన ధరలకే అందిస్తూ, ఇసుక అక్రమ రవాణా కు తావులేకుండా చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి కొత్త పాలసీ తెచ్చినా యథావిధిగా ఇసుక బ్లాక్ మార్కెటింగ్ మాత్రం ఆగడం లేదు. చిత్తూరు జిల్లా వరదయ్యపాళ్ళెం మండలం చెన్నవారి పాళ్యెం కరుణానది పరివాహక ప్రాంతం లో ఇసుక అక్రమ తరలింపు యథేచ్ఛగా సాగిపోతున్నది.
ట్రాక్టర్ ల సాయంతో అర్ధరాత్రి గుట్టచప్పుడు కాకుండా యధేచ్చగా ఇసుకను తరలిస్తూ మాఫియా లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మాత్రం ఇసుక దొరకడం లేదు. వరదయ్యపాళ్ళెం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ మీదుగా ఈ ఇసుక రవాణా జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇకనైనా సంబంధిత అధికారులు నిద్రావస్థలో నుండి మేల్కోని నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఇసుక దందాకు అడ్డుకట్టవేయాలని స్థానికులు కోరుతున్నారు.