తెలంగాణ ముద్దు బిడ్డ.. విశాలాంధ్ర అనుంగు పుత్రుడు
భరత మాత గారాబు తనయుడు
పాముల పర్తి వారి వంశాంకురం నరసింహ రావు
వంగర నుండి భాగ్య నగరం దాటి హస్తినాపురం వరకు వ్యాపించిన సుమ గంధం
విద్యాభ్యాసం చేస్తూనే దేశపరిస్థితుల అవగాహన
కర్తవ్యం గుర్తెరిగిన దేశ భక్తి
రజాకార్ల, భూస్వాముల అరాచక పాలన నెదిరించే ధీరత్వం
అందలం చేతి కందగనే అందరికీ భూమి కోసం స్వoత భూమినే దానం యిచ్చిన ఆదర్శం
భూసంస్కరణల అమలులో శత్రువర్గానికి భయపడని స్థైర్యం
వెనుకబడిన వర్గాల శ్రేయోభిలాషి గా స్థిరచిత్తం
బహుజన బాంధవుడై పదవిని సైతం తృణీకరించిన త్యాగశీలం
జనపదం నుండి అఖిల భారతం వరకూ మానవ వనరులు విస్తరించాలని నవోదయo కోసం విద్యాలయాల స్థాపన
నడిసంద్రం లో కొట్టుమిట్టాడుతున్న భారత నౌకను.. ప్రపంచీకరణ మార్గం లో
ఆర్థిక సంస్కరణ తో తీరానికి చేర్చిన అర్థ శాస్త్రజ్ఞుడైన
అపర చాణక్యుడు
దేశ గత, వర్తమాన, భావి కాలాల బేరీజుతో పాలించిన కాలత్రయ దార్శనికుడు
విదేశాలలో నైనా, విపక్షాలతో నైనా సత్సంబంధాలు నెల కొల్పిన రాజనీతిజ్ఞుడు
బహు భాషాకోవిదుడై రాణించిన సాహితీ మూర్తి
అపర కౌటిల్యుడై శత్రువుల ఎత్తులను చిత్తు చేస్తూ పరిపాలనా దక్షుడై
సమర్థుడై.. స్థితప్రజ్ఞుడై భాసిల్లిన, ఠీవీ గా రాణించిన పీ.వి.గా
ఢిల్లీ కి రాజునైన తల్లికి కొడుకునే అనే నిగర్వి గా మాతృ దేశాభిమానియైన అతడే భారత రత్న
పాములపర్తి వెంకట నరసింహ రావు
-పెద్దాడ మల్లికార్జున రావు, సత్తుపల్లి, సెల్ నెం: 9652495356