విద్యను నేర్పడం ద్వారా అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు ప్రసరింప చేసిన సావిత్రి బాయి ఫూలే జీవితం చిరస్మరణీయం అని BC టీచర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు రాపోలు పరమేష్ అన్నారు. సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్ నందు BC టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సావిత్రి బాయి ఫూలే 190వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పరమేష్ మాట్లాడుతూ సావిత్రి బాయి ఫూలే భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, నిమ్న వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని అన్నారు. కుల,మతాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి అన్నారు.
ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన సావిత్రి బాయి ఫూలే తన భర్తతో కలసి 1848 జనవరి 1న, పూణే నగరంలో మొట్ట మొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించిందన్నారు. అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు, సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన ఆనాటి సమాజపు కట్టుబాట్లను, బ్రాహ్మణ వాద సంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను ధిక్కరించి భారత దేశపు మొట్ట మొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలలు ప్రారంభించిందన్నారు.
సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి అని అన్నారు. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించిన మహిళా సావిత్రిబాయి ఫూలే అన్నారు.సత్య శోధక్ సమాజ్ ను ప్రారంభించి బాల్య వివాహలకు, మూఢ నమ్మకాలకు, సతీ సహగమనానికి వ్యతిరేకంగా, బలమైన ఉద్యమం నడిపారని అన్నారు.
సావిత్రిబాయి సంఘ సంస్కర్తగానే కాక, రచయిత్రిగా ధృవతారగా నిలిచారని,1854లోనే ఆమె తన కవితా సంపుటి ‘కావ్యఫూలే’ను ప్రచురించిందన్నారు. తెలంగాణాకు తలమానికమైన బతుకమ్మ పాటలు ఆనాడే రచించారని,ఆమె ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
ఈ సందర్భంగా మహిళ ఉద్యోగికి సన్మానం చేశారు. BCTU నాయకులు బడిగ వీరబాబు అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో BCTU రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐతగోని జానయ్య, జి.శ్రీనివాస్, కె.చంద్ర శేఖర్,ఎన్.పాపయ్య స్వేరోస్, ఎం.సుందర్,కె.వీరస్వామి,ఏ.కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.