ప్రజలు సైబర్ నేరాల పడితే తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, లేదా టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి వివరాలు తెలపాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి సురేందర్ రెడ్డి మంగళ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సైబర్ నేరగాళ్లు ప్రజలు, వ్యాపారులకు వివిధ రకాల ఆశ చూపి మోసగిస్తున్నారని పలు రకాల ఆర్థిక లావాదేవీలపై కన్నేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ తరహా నేరాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్లు 1930, లేదా డయల్ 100 సేవలను ఉపయోగించుకోవాలని అన్నారు.
సైబర్ నేరాల బాధితులు జాప్యం చేయకుండా పిర్యాదు చేయాలన్నారు. అపరిచిత వ్యక్తుల పోన్ కాల్స్, మెస్సేజ్లు లింక్స్ ఓపెన్ చేసి ఇబ్బందులకు గురికావద్దని ఎస్పి హెచ్చరించారు. NCRP పోర్టల్ (www.cybercrime.gov.in) లో పిర్యాదు చేస్తే తక్షణమే స్పందిస్తారని సురేందర్ రెడ్డి తెలిపారు.
మోసపోయిన బాధితుడి డబ్బులు 65 వేల రూపాయలు రికవరీ
భూపాలపల్లికి చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగికి చెందిన లక్ష రూపాయలను సైబర్ నేరగాళ్లు దొచుకోగా, వెంటనే బాధి తుడు భూపాలపల్లి పోలీసు స్టేషన్ లో సంప్రదించగా, భూపాలపల్లి సైబర్ క్రైమ్ టీమ్ వెంటనే స్పందించి, డబ్బులు జమ అయిన బ్యాంక్ కు మెయిల్ చేసి, డబ్బులు ఫ్రీజ్ చేపించి, పోగొట్టుకున్న Rs. రూ. లక్ష నుంచి రూ 65 వేలు తిరిగి ఇప్పించారు.
మహాదేవపూర్ కి చెందిన ఒకవ్యక్తి Flipkart లో ఆర్డర్ చేసిన ఒక వస్తువును కాన్సుల్ చేసాడు. డబ్బులు రిఫండ్ కాకపోవడంతో ఫ్లిప్కార్ట్ నెంబర్ కోసం గూగుల్ లో వెతికాడు. ఒక ఫేక్ నెంబర్ వచ్చింది కాల్ చేసాడు. వాళ్ళు చెప్పిన విధంగా AnyDesk అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి డెబిట్ కార్డు నెంబర్ మరియు ఓటీపీ ఎంటర్ చేసాడు, వెంటనే బాధితుడి ఖాతా నుండి రూ. 50 వేలు డెబిట్ అయ్యాయి.
బాధితుడు మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకి పిర్యాదు చేసాడు. వెంటనే సైబర్ క్రైమ్ టీం స్పందించి, సైబర్ నేరగాడి బ్యాంకు ఖాతాను నిలుపుదల చేసి, డబ్బులు తిరిగి బాధితుని అకౌంట్ లో జమ చేయించారు. ఈ సందర్బంగా సైబర్ క్రైమ్ విధులను సమర్థవంతగా నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ పెద్దన్న కుమార్, పిసి స్వామి గౌడ్ ను ఎస్పి అభినందించారు.