ఢిల్లీ దాని సమీప నగరాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ ఆదేశించింది. దీపావళి నుంచి నగరాన్ని విషపూరిత పొగమంచు కప్పేసింది. దీంతో విద్యా సంస్థలు మూసివేయాలని కోరింది. దీంతో పాఠశాలలు కోవిడ్ లాక్డౌన్ సమయంలో నిర్వహించినట్లు ఆన్లైన్ తరగతులు నిర్వహించే అవకాశం ఉంది.
CAQM జారీ చేసిన తొమ్మిది పేజీల ఉత్తర్వుల ప్రకారం నవంబర్ 21 వరకు కనీసం 50 శాతం మంది సిబ్బందిని ఇంటి నుండి పని చేయడానికి అనుమతించాలని NCR ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్,ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఢిల్లీ NCR లోని ప్రైవేట్ సంస్థలు కూడా తప్పనిసరిగా తమ సిబ్బందిలో కనీసం 50 శాతం మందిని ఇంటి నుంచి పని చేసేందుకు అనుమతించాలని CAQM ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రస్తుతం ఢిల్లీ NCR అంతటా నిర్మాణ కార్యకలాపాలు, కూల్చివేత ప్రాజెక్టులు నవంబర్ 21 వరకు నిలిపివేశారు. రైల్వే సేవలు/స్టేషన్లు, మెట్రో కార్యకలాపాలు, విమానాశ్రయాలు, బస్ టెర్మినల్స్, అలాగే జాతీయ భద్రత లేదా రక్షణ సంబంధిత కార్యకలాపాల ప్రాజెక్ట్ లకు మినహాయింపులు ఉన్నాయి. నిత్యావసర వస్తువులను తీసుకువెళ్లే ట్రక్కులను మినహాయించి మిగతా ట్రక్కుల అనుమతించవద్దని ఆదేశించింది.