100కి పైగా భాషల్లో పదాలు, మాట ద్వారా ఇంటర్నెట్లో కావాల్సిన అంశాలను వెతికే (సెర్చ్ చేసే) వీలు కల్పించేందుకు గూగుల్ కసరత్తు చేస్తోందని ఆ సంస్థ సీఈఓ, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ తెలిపారు. కృత్రిమమేధ ను ఇందుకు వినియోగిస్తామని గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమంలో వివరించారు. భారత్కు ప్రకటించిన 1000 కోట్ల డాలర్లతో, పదేళ్ల కాలానికి ఏర్పాటు చేసిన ఇండియా డిజిటైజేషన్ ఫండ్ నుంచి వెచ్చించిన నిధుల వల్ల ఎంత మేర పురోగతి ఉందో తెలుసుకోవడానికి, కొత్త పద్ధతులను పంచుకోవడానికి తాను భారత్కు వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే 1000 భాషలను ఆన్లైన్లోకి తేవాలన్న తమ ప్రయత్నాల్లో భాగంగానే, దేశీయంగా 100 భాషల్లోనే సెర్చ్ చేసే అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ భాషలో జ్ఞానాన్ని, సమాచారాన్ని పొందేలా చేయాలన్నది దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఐఐటీ మద్రాస్తో కలిసి సరికొత్త మల్టీ డిసిప్లేనరీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ప్రజలు సాంకేతికతను ఉపయోగించుకుంటున్న తీరును చూసి తనకు ఆశ్చర్యం వేస్తోందని, జీవన ప్రమాణాలు ఎంతో మెరుగవుతున్నాయని వివరించారు. భారత పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్లను ఆయన కలిశారు .
రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పిచాయ్ కలిసి వివిధ అంశాలపై చర్చించారు. భారత నైపుణ్యానికి, జ్ఞానసంపత్తికి సుందర్ పిచాయ్ ప్రతీక అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. దేశంలో అందరికీ డిజిటల్ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయాలని సూచించారు.
ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా విజన్ వల్లే దేశంలో సాంకేతికత మార్పులు అత్యంత వేగంగా చోటుచేసుకున్నాయని సుందర్ పిచాయ్ తెలిపారు. తన తదుపరి పర్యటనలో మరింత పురోగతిని చూస్తానని ఆకాంక్షించారు. భారత్ అతిపెద్ద ఎగుమతి ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అన్నారు. ప్రజల భద్రతను పరిరక్షించడం, కంపెనీలు వినూత్నత దిశలో అడుగులు వేయించే విషయంలో సమతుల్యత తీసుకు రావాలని ప్రభుత్వానికి సూచించారు.
భారత్లో అంకురాల కోసం కేటాయించిన 300 మిలియన్ డాలర్లలో నాలుగో వంతును మహిళా సారథ్య అంకురాల్లో పెట్టుబడిగా పెడతామని గూగుల్ ఇండియా వైస్ప్రెసిడెంట్, కంట్రీ మేనేజర్ సంజయ్ గుప్తా తెలిపారు. అందరికీ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు 10 బిలియన్ డాలర్ల నిధిని గూగుల్, ఐడీఎఫ్ కింద ప్రకటించింది. ఈ నిధి ద్వారానే జియోలో 7.73 శాతం వాటాను 4.5 బి.డాలర్లకు, భారతీ ఎయిర్టెల్లో 1.2 శాతం వాటాను 700 మిలియన్ డాలర్లకు గూగుల్ కొనుగోలు చేసింది. ‘మున్ముందు ప్రాథమిక స్థాయిలో ఉన్న మహిళా సారథ్య అంకురాలకు ఈ నిధి నుంచే సహకారం అందిస్తామ’ని తెలిపారు.