హైదరాబాద్ లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఓ సెక్యూరిటీ గార్డు అపస్మారక స్థితిలోకి వెళ్లి కాసేపటికే మరణించాడు. డీసీపీ శిల్పవల్లి కథనం ప్రకారం.. నానక్ రాంగూడ లోని ఓ లేబర్ క్యాంపులో బిహారుకు చెందిన నితీశ్ (32), బిట్టు, వికాస్లు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. క్యాంపులోని కూలీలు బయటకు వెళ్లేందుకు యత్నించారు.
సెక్యూరిటీలు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఇద్దరు కూలీలకు గాయాలయ్యాయి. దీంతో కూలీలు డయల్100కు కాల్ చేయడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయాలైన కూలీలను ఆస్పత్రికి తరలించారు.ఈ వ్యవహారంలో విచారించేందుకు సెక్యూరిటీ గార్డులు ముగ్గురిని పోలీసులు స్టేషన్కు తీసుకొచ్చారు.
అయితే వీరిలో నితీశ్ అనే సెక్యూరిటీ గార్డు అపస్మారక స్థితికి వెళ్లాడు. అది గమనించిన పోలీస్ సిబ్బంది వెంటనే సీపీఆర్ చేశారని.. తర్వాత సమీపంలోని హిమగిరి ఆస్పత్రికి తరలించారు.కొద్ది సేపు చికిత్స చేసిన వైద్యులు నితీశ్ మృతి చెందాడని ప్రకటించారు. ఛాతీలో తీవ్రనొప్పితో నితీశ్ మృతి చెందాడని వైద్యులు చెప్పారని డీ సీపీ శిల్పవల్లి తెలిపారు.