రాష్ట్రంలో 12918 పంచాయతీలలో దొంగలు పడి 8660 కోట్ల రూపాయలు దొంగిలించారని ఏలూరు జిల్లాలో కొంతమంది పంచాయతీ సర్పంచ్ లు సోమవారం ఏలూరు జిల్లా ఎస్ పి మేరీ ప్రశాంతి కి పిర్యాదు చేసారు. రాష్ట్రం లో 2018 నుండి 2022 వరకు కేంద్ర ప్రభుత్వం 14, 15 వ ఆర్థిక సంఘ నిధుల క్రింద 8660 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని సర్పంచ్ లు ఎస్ పి కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
రెండున్నరేళ్ల క్రితం ఎన్నికైన సర్పంచ్ లు సి ఎస్ ఎఫ్ ఎం ఎస్ బాంక్ ఖాతాలు పరిశీలించి చూస్తే నిధులు కనిపించడం లేదని పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షులు కడలి గోపాలరావు, గౌరవాద్యక్షులు పిల్లి సత్తి రాజు, జిల్లా సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు పాలడుగు లక్ష్మణ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితి పై రాష్ట్ర పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి ని స్వయంగా కలిసి వినతి పత్రం అందించామని, రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులను, పంచాయతీ రాజ్ మంత్రి కి లేఖలు రాసినా ఇంతవరకు ఎటువంటి స్పందన లేదని తెలిపారు.
పంచాయతీ నిధులకు సంబంధించిన చెక్ లపై సర్పంచి ల సంతకాలు లేకుండా సర్పంచ్ లకు తెలియకుండా నిధులు దొంగిలించారని దీనిని సైబర్ నేరం క్రింద పరిగణించి విచారణ చేపట్టి పంచాయతీల నిధులు పంచాయతీలకు ఇప్పించి దోషులను కఠిన చర్యలను చేపట్టాలని కొంత మంది టి డి పి సర్పంచ్ లు ఒక జన సేన సర్పంచ్ ఎస్ పి ని కలిసిన వారిలో ఉన్నారు.