గడువులోగా సీతారామ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి, గోదావరి నీళ్లు ఎత్తిపోసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం ప్రకారం వ్యవసాయ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు చేసిందని అందుకే పంటలు విరివిగా పండుతున్నాయని ఆయన అన్నారు.
పండిన పంటలకు గిట్టుబాటు ధర కూడా కల్పిస్తున్నామని ఆయన అన్నారు. భద్రాచలం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణంలో జరిగిన సభకు ముఖ్య అతిధిగా హాజరై ఆయన ప్రసంగించారు. యాదాద్రి నిర్మాణం పూర్తి అయిన వెంటనే భద్రాద్రి పైనే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెడతారని మంత్రి అజయ్ తెలిపారు.
భద్రాచలంకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, చరిత్రకు ప్రతీకగా నిలువనుందని ఆయన అన్నారు. ప్రతి గ్రామానికి త్రాగు, సాగు నీరు, అన్ని అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చుతామని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లాలో ఉన్న ప్రతి సమస్యను తమ దృష్టికి తీసుకురావొచ్చునని ఆయన అన్నారు.
వాజేడు, వెంకటాపురం లాంటి గ్రామాల్లో ఉన్న పోడు భూముల సమస్య ముఖ్యమంత్రి దృష్టిలో ఉందని ఆయన దాన్ని త్వరలోనే పరిష్కరిస్తారని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్రు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.